Nara Lokesh: ప్రైవేటు ఉపాధ్యాయులను తక్షణమే ఆదుకోండి: సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ

TDP MLC Nara Lokesh wrote CM Jagan

  • కరోనా వ్యాప్తితో మూతపడిన విద్యాసంస్థలు
  • ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయం
  • కూలీలుగా మారారన్న లోకేశ్
  • ఇతర రాష్ట్రాల్లో ఆర్థికసాయం అందించారని వెల్లడి

కరోనా సంక్షోభం కారణంగా ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడడంతో ప్రైవేటు ఉపాధ్యాయుల ఆర్థిక పరిస్థితి దుర్భరంగా తయారైంది. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులను వెంటనే ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. కరోనా రెండు దశల్లోనూ తీవ్ర నష్టం మిగిల్చిందని, తద్వారా ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. పాఠశాలల పునఃప్రారంభం నాడే కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ఒక ప్రైవేటు పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.

గత ఐదు నెలలుగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని లోకేశ్ వివరించారు. బోధనా వృత్తిలో జీతాలు రాక ఉపాధ్యాయులు కూరగాయల విక్రయం, భవన నిర్మాణ కార్మికులుగా కూలి పనికి వెళ్లడం, వ్యవసాయ కూలీలుగా మారడం వంటి విషాద గాథలు ఎన్నింటినో మీడియాలో చూస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు నెలకు రూ.2 వేలు ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం అందించిందని లోకేశ్ గుర్తుచేశారు. అటు కర్ణాటక సర్కారు నెలకు రూ.5 వేలు ఆర్థిక సాయం అందించిందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేటు ఉపాధ్యాయుల జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు.

Nara Lokesh
Letter
CM Jagan
Private Teachers
  • Loading...

More Telugu News