Etela Rajender: మ‌న ముఖ్య‌మంత్రికి ఒక అల‌వాటు ఉంది.. ఎప్పుడు ఉప ఎన్నిక వ‌చ్చినా ఇలాగే చేస్తారు: ఈట‌ల

etela slams trs

  • ఉప ఎన్నిక వ‌స్తుందంటే కేసీఆర్ వ‌రాలు ప్ర‌క‌టిస్తారు
  • ఇప్పుడు హుజూరాబాద్‌లో మీకు ఓట్లు కావాలి
  • కాబ‌ట్టి ఇప్ప‌టికైనా నిరుద్యోగ భృతి ఇవ్వాలి
  • ఇప్ప‌టికైనా ఇక్కడి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చాలి

ఉప ఎన్నిక వ‌స్తుందంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాలు ప్ర‌క‌టిస్తారని తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎద్దేవా చేశారు. 'అధికారంలో ఉన్ననాడు, అధికారంలో లేనినాడు ప్ర‌తి స‌మ‌యంలో నేను ప్ర‌జ‌ల హృద‌యాల్లో చోటు సంపాదించుకుని వారి మెప్పుపొందిన బిడ్డ‌గా ఉన్నాను' అని ఈట‌ల అన్నారు.

'టీఆర్ఎస్‌కి రాజీనామా చేసి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌లంద‌రూ నాతో చెబుతున్నారు. భ‌ర్త చ‌నిపోతే భార్య‌కు పింఛ‌ను రావాలని, కానీ రావ‌ట్లేద‌ని అన్నారు. పింఛ‌న్లు ఆగిపోయాయి అని చెప్పారు. రెండున్న‌రేళ్లుగా కొత్త రేష‌న్ కార్డులు ఇవ్వ‌ట్లేద‌ని తెలిపారు. రాజీనామా త‌ర్వాత ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌ను నా దృష్టికి తీసుకొచ్చారు' అని ఈట‌ల చెప్పారు.

'ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గంలో తెల్ల రేష‌న్ కార్డులు, పింఛ‌న్ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి. అదే విధంగా 58 ఏళ్లు నిండిన అంద‌రికీ పింఛ‌న్లు ఇవ్వాలి. 2018 ఎన్నిక‌ల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పారు. ఇప్పుడు ఇవ్వండి. హుజూరాబాద్‌లో మీకు ఓట్లు కావాలి కాబ‌ట్టి ఇప్ప‌టికైనా నిరుద్యోగ భృతి ఇవ్వాలి' అని ఈట‌ల డిమాండ్ చేశారు.

'వావిరాలను మండ‌లంగా చేయాల‌ని కోరాను. గ‌తంలో చ‌ల్లూరు మండ‌లం కావాల‌ని  కోరాను. అలాగే, హుజూరాబాద్‌ను జిల్లా చేయాల‌ని కోరాను. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం. మా కోరిక మేర‌కు త‌క్ష‌ణ‌మే ఈ దిశ‌గా అడుగులు వేయాలి. మ‌న ముఖ్య‌మంత్రికి ఒక అల‌వాటు ఉంది. ఎప్పుడు ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా ఆ ని‌యోజక వ‌ర్గాల్లో వ‌రాల జ‌ల్లు కురిపించే అల‌వాటు ఉంది. కాబ‌ట్టి ఈ నియోజ‌క వ‌ర్గంలో కూడా మూల‌న ప‌డ్డ ప‌నులు జ‌రిగేలా నిధులు విడుద‌ల చేయాల‌ని నేను కోరుతున్నాను' అని ఈట‌ల డిమాండ్ చేశారు.

'మ‌ళ్లీ నేను చెబుతున్నాను.. గొర్రెల మంద మీద తోడేళ్లు ప‌డ్డ‌ట్లు టీఆర్ఎస్ ప్ర‌వ‌ర్తిస్తోంది. ఎన్న‌డూ హుజూరాబాద్‌కు సాయం చేయ‌లేదు. ఇప్పుడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుందని చాలా మంది ప్ర‌భుత్వ‌ పెద్ద‌లు ఇక్క‌డికి వ‌స్తున్నారు. 18 ఏళ్లుగా న‌న్ను ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు. ఇక్క‌డ కుటుంబ స‌భ్యులుగా బ‌తికిన మ‌మ్మ‌ల్ని విడ‌దీయాల‌ని చూస్తున్నారు' అని ఈట‌ల విమర్శించారు.

'స‌ర్పంచులు, ఎంపీటీసీలు, ఇత‌ర నేత‌ల‌ను, న‌న్ను  విడ‌దీయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. వీట‌న్నింటినీ చూసి ప్ర‌జ‌లు, నేత‌లు బాధ‌ప‌డుతున్నారు. మేమంతా ఇక్క‌డ కాకులు దూర‌ని కార‌డ‌విలా, చీమ‌లు దూర‌ని చిట్ట‌డ‌విలా ఉంటున్నాం. ప్ర‌జ‌లు ఓట్లు వేసేది ప్ర‌జ‌ల మీద దాడి చేయ‌డానికి కాదు' అని ఈట‌ల ఆవేశంగా అన్నారు.

నేను పార్టీ పెట్ట‌లేదు..పార్టీ మార‌లేదు
'నేను పార్టీ పెట్ట‌లేదు.. పార్టీ మార‌లేదని' ఈట‌ల అన్నారు. "ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు మాత్రం వ‌చ్చాను. 'ఎవ‌రో అనామ‌కుడు ఇచ్చిన ఫిర్యాదు వ‌ల్ల నాపై వేటు వేశారు. త‌ప్పకుండా మీరు తవ్విన బొంద‌లో మీరే ప‌డ‌తారు. నేను ఎన్న‌డూ డబ్బులు ఇచ్చి గెల‌వ‌లేదు. మీరు డ‌బ్బులు ఇచ్చి గెలుస్తున్నారు. అటువంటి ప‌నులు హుజూరాబాద్‌లో కొంద‌రు చెంచాగాళ్ల‌ను పెట్టుకుని దొంగ దెబ్బ కొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రేపు ఇక్క‌డ ఎన్నిక‌లు అంటే కురుక్షేత్ర యుద్ధం జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ న్యాయ‌యుద్ధం జ‌రుగుతుంది. హుజూరాబాద్ ప్ర‌జ‌లే ఇక్క‌డ గెలుస్తారు. మీ చిల్ల‌ర ప‌నుల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తే వాటికి ప్ర‌జ‌లు ప్ర‌భావితం కారు' అని ఈట‌ల తీవ్ర స్వరంతో అన్నారు.

  • Loading...

More Telugu News