Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు!

Supreme Court grants bail to Raghu Rama Krishna Raju

  • రఘురాజు మీడియా ముందుకు రాకూడదు
  • విచారణకు పిలిచిన 24 గంటల్లో హాజరుకావాలి
  • గాయాలను గతంలోలా ఎక్కడా ప్రదర్శించకూడదు  
  • రఘురాజుకు కస్టోడియల్ విచారణ అవసరం లేదు

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి..  రఘురామకృష్ణరాజు మీడియా లేదా సోషల్ మీడియా ముందు  మాట్లాడకూడదని ఆదేశించింది. తనకు అయిన గాయాలను గతంలో చూపించినట్టుగా ఎక్కడా ప్రదర్శించకూడదని ఆదేశించింది. విచారణను ప్రభావితం చేసే పనులు చేయకూడదని చెప్పింది.

విచారణకు పిలిచిన 24 గంటల్లో రఘురాజు హాజరు కావాలని... విచారణకు సంబంధించిన నోటీసును కూడా అధికారులు ఆయనకు 24 గంటల ముందుగానే ఇవ్వాలని సుప్రీం తెలిపింది. పోలీసు విచారణకు రఘురాజు సహకరించాలని ఆదేశించింది.  న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని ఆదేశించింది. పోలీసుల కస్టడీలో ఆయన పట్ల దురుసుగా వ్యవహరించారనే అభిప్రాయాన్ని న్యాయస్థానం వ్యక్తం చేసింది.

రఘురామకృష్ణరాజుపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించవలసినవి  కాదని.. కాబట్టి రాజుకు కస్టోడియల్ విచారణ అవసరం లేదని, ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నామని సుప్రీం చెప్పింది. పది రోజుల్లోగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారుల పూచీకత్తు ట్రయల్ కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇరువర్గాల సుదీర్ఘ వాదనలను వినింది. దాదాపు మూడు విడతలుగా కేసును విచారించింది.

  • Loading...

More Telugu News