Oxygen: మే రెండో వారం నాటికి ఆక్సిజన్​ కొరత తీరుతుంది: లిండే సంస్థ ప్రకటన

Oxygen shortage may ease by Mid May Says Linde

  • ఉత్పత్తి 25 శాతం పెరుగుతుందని వెల్లడి
  • రోజూ 9 వేల టన్నుల ఉత్పత్తి జరుగుతుందని కామెంట్
  • 100 భారీ క్రయోజెనిక్ కంటెయినర్లను తెప్పిస్తున్న కేంద్రం
  • ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ సరఫరాకు వీలు

దేశంలో ఆక్సిజన్ కొరత మే మధ్య నాటికి తీరుతుందని దేశంలో అతిపెద్ద ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థ అయిన లిండే పీఎల్ సీ ప్రకటించింది. ఆక్సిజన్ లభ్యత 25 శాతం పెరుగుతుందని, అప్పటికి డిమాండ్ కు తగినట్టు ఆక్సిజన్ రవాణా మౌలిక వసతులూ మెరుగుపడతాయని సంస్థ దక్షిణాసియా అధిపతి మొలోయ్ బెనర్జీ చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ నెలలోనే ఆక్సిజన్ వినియోగం 8 రెట్లు పెరిగిందన్నారు. ఈ ఒక్క నెలలోనే 7,200 టన్నుల ఆక్సిజన్ ను వినియోగించారని చెప్పారు.

ప్రాణవాయువు వినియోగం అమాంతం పెరిగిపోవడం వల్లే కొరత పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇంతటి సంక్షోభం వస్తుందని ఎవరూ ఊహించలేదని చెప్పారు. లిండే ఇండియా, ప్రాక్షాయిర్ ఇండియా తదితర సంస్థలు కలిసి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుతున్నాయన్నారు. సామర్థ్యాన్ని రోజూ 9 వేల టన్నులకు పెంచుతామని అన్నారు.

మే రెండో వారం నాటికి ఆక్సిజన్ రవాణా మౌలిక వసతులూ మెరుగుపడతాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ను రవాణా చేసేందుకు 100 భారీ క్రయోజెనిక్ (అతి శీతల) కంటెయినర్లను భారత్ దిగుమతి చేసుకుంటోందని తెలిపారు. అందులో 60 కంటెయినర్లను లిండే అందిస్తోందన్నారు.

  • Loading...

More Telugu News