Corona Virus: దేశంలో క‌రోనా మ‌ర‌ణాల లెక్క‌ల్లో త‌ప్పులు: శాస్త్ర‌వేత్త‌ షాహిద్‌ జమీల్‌

mistakes in corona deaths

  • భార‌త్‌లో సాధారణంగా ప్ర‌తి రోజు 28,000 మంది మృతి
  • క‌రోనా కార‌ణంగా 2,300 నుంచి 2,800 మ‌ధ్య రోగులు మృతి అంటున్నారు
  • అదే నిజ‌మైతే శ్మ‌శానాల్లో ఎప్ప‌టిలాగే సాధార‌ణ ప‌రిస్థితులు ఉండాలి
  • ఇంతలా రద్దీ ఉండ‌దు  

భార‌త్‌లో క‌రోనా కేసుల ఉద్ధృతి ఊహించ‌ని స్థాయిలో పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. మ‌ర‌ణాల సంఖ్య కూడా అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. అయితే, ప్ర‌భుత్వ గ‌ణాంకాల్లో న‌మోద‌వుతున్న లెక్క‌ల‌క‌న్నా మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉంటుంద‌ని, దేశంలో మరణాలను సరిగా లెక్కించడం లేదని ప్ర‌ముఖ‌ శాస్త్ర‌వేత్త‌ డాక్టర్‌ షాహిద్‌ జమీల్ అన్నారు.

భార‌త్‌లో సాధారణంగా ప్ర‌తి రోజు 28,000 మంది మృతి చెందుతుంటార‌ని, క‌రోనా కార‌ణంగా 2,300 నుంచి 2,800 మ‌ధ్య రోగులు మృతి చెందుతున్న‌ట్లు ప్ర‌భుత్వ గ‌ణాంకాల్లో చెబుతున్నార‌ని ఆయ‌న అన్నారు. రోజువారీ సాధార‌ణ‌ మరణాలతో పోలిస్తే క‌రోనా మ‌ర‌ణాలు 10 శాతం మాత్రమే ఉన్నాయ‌ని తెలిపారు.

ప్ర‌భుత్వం చెబుతోన్న లెక్క‌లు నిజమైతే దేశంలోని శ్మశానాల్లో ఎప్ప‌టిలాగే సాధార‌ణ ప‌రిస్థితులు ఉండాల‌ని, ఇంతలా రద్దీ ఉండదని చెప్పారు. క‌రోనా మరణాలు తక్కువగా కనిపించడానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని, త‌మ బంధువుకు ఈ నెల 13న క‌రోనా పరీక్ష చేశార‌ని, ఆయ‌న ఫ‌లితాలు రాక‌ముందే  23న చనిపోయారని వివ‌రించారు.

దీంతో ఆ మరణం క‌రోనా మృతుల‌ లెక్కలోకి రాదని, ఇలాంటి అంశాలు తప్పితే గణాంకాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారని తాను భావించడంలేదని చెప్పారు. పరీక్షలు స‌రిగ్గా నిర్వహించకపోతే క‌రోనా కేసుల సంఖ్య కూడా కచ్చితంగా తెలియదని ఆయ‌న వివ‌రించారు. క‌రోనా వైరస్‌ లక్షణాలను జన్యుపరిణామ క్ర‌మం ప్ర‌కారం విశ్లేషించాల‌ని అలా చేస్తే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలుస్తుందని ఆయ‌న చెప్పారు.  

ఇప్పటివరకు 20,000 రకాల వైరస్‌ల జన్యుపరిణామ క్రమాన్ని విశ్లేషించార‌ని, అయితే ఈ ఏడాది ఫిబ్రవరి అనంత‌రం నమోదైన కేసుల్లో ఈ విశ్లేషణ పరిమాణం 1 శాతం మాత్రమే ఉంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశంలో క‌రోనా పూర్తి భిన్నంగా ఉన్నట్లు అందులో తేలిందని వివ‌రించారు.

పంజాబ్ తో పాటు హ‌ర్యానా, జమ్మూకశ్మీర్, ఢిల్లీలో యూకే రకం బి 117 మ్యూటెంట్ ప్రబలంగా ఉందని ఆయ‌న తెలిపారు. క‌రోనా ఉద్ధృతి అధికంగా ఉన్న మహారాష్ట్రలో భార‌త‌ రకం బి-1617... 35-40 శాతం వరకు ప్రబలిందని తెలిసింద‌ని ఆయ‌న చెప్పారు.

 ఆ మ్యూటెంట్‌నే మీడియా డబుల్‌ మ్యూటెంట్‌గా పిలుస్తోందని చెప్పారు. అయితే, అది ఇప్పుడు ట్రిపుల్‌ మ్యూటెంట్‌గా పరిణామం చెందిందని కొందరు అంటున్నార‌ని, అది స‌రికాద‌ని  ప్ర‌స్తుతం వైరస్‌లో దాదాపు 15 మ్యూటేషన్లు ఏర్పడ్డాయని వివ‌రించారు. అనేక మార్పుల వ‌ల్ల కొన్ని ర‌కాల మ్యూటెంట్‌లు మాన‌వుడిలోని ప్ర‌తిర‌క్ష‌కాల నుంచి కూడా తప్పించుకోగలుగుతున్నాయని చెప్పారు.

ఒక‌వేళ‌ రోగనిరోధక శక్తి ఏడాదిలోపే క్షీణించిపోతే భార‌త్‌లో ప్రతి శీతాకాలంలో మహమ్మారి విజృంభిస్తుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. అది పూర్తిగా కొత్త ర‌కం వైరస్ అని దాన్ని ఎదుర్కొనే ముందస్తు రోగనిరోధక శక్తి మన దగ్గర లేదని, అందువల్ల అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాల‌ని ఆయ‌న చెప్పారు.

మ‌రోవైపు, దేశంలో చాలా మంది క‌రోనా రోగుల‌కు అందిస్తోన్న‌ ప్లాస్మాథెరపీలోనూ లోపాలున్నాయని ఆయ‌న వివ‌రించారు. అస‌లు ఈ ప‌ద్ధ‌తి రోగి శ‌రీరంలో ప్ర‌తిర‌క్ష‌కాల‌ను వృద్ధి చేస్తోందా అన్న విష‌యం సరిగా అధ్యయనం చేయకుండానే ప్లాస్మాథెర‌పీ చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఇటువంటి చర్యలే మ్యూటేషన్లకు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.



  • Loading...

More Telugu News