India: భారత్‌కు అండగా ఉంటాం.. ఐరోపా సమాఖ్య, జర్మనీ ప్రకటన

EU Germany gets ready to help india

  • భారత్‌లో విజృంభిస్తున్న కరోనా
  • విచారం వ్యక్తం చేసిన ప్రపంచ దేశాలు
  • ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సహా పలు దేశాల సంఘీభావం
  • కావాల్సిన సాయం అందిస్తామని హామీ

కరోనా ఉద్ధృతితో అతలాకుతలమవుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. కావాల్సిన సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. తాజాగా ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్‌, జర్మనీ తమ సంఘీభావాన్ని ప్రకటించాయి.

భారత్‌ కోరిక మేరకు కావాల్సిన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. అత్యసవరంగా కావాల్సిన ఆక్సిజన్‌, ఔషధాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే ఐరోపా సమాఖ్య సభ్య దేశాల నుంచి వనరులు సేకరించడం ప్రారంభించామని ఈయూ అధ్యక్షుడు ఉర్సులా వెల్లడించారు. భారత ప్రజల పట్ల పూర్తి సంఘీభావం ప్రకటించారు.

ఇక భారత్‌లో పరిస్థితిపై జర్మనీ ఛాన్స్‌లర్‌ ఎంజెలా మెర్కెల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొవిడ్‌తో పోరాడుతున్న భారత ప్రజల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. అయితే, ఎలాంటి సాయం అందించనున్నారో ప్రకటించనప్పటికీ.. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్‌ అందించేందుకు జర్మనీ సైన్యం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇక ఇజ్రాయెల్ తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. భారత్‌కు సాయం అందించేందుకు అక్కడి  ప్రభుత్వం సిద్ధమైనట్లు పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ప్రతినిధి అమిచాయ్‌ స్టెయిన్‌ తెలిపారు. అవసరమైన వైద్య సాయం అందించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.

ఇక ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, చైనా, పాకిస్థాన్‌.. భారత్‌ పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వీలైన మార్గంలో సాయం చేస్తామని ప్రకటించాయి.

India
Corona Virus
Germany
EU
  • Loading...

More Telugu News