Pakistan: క‌రోనాతో క్లిష్ట‌ప‌రిస్థితులు ఎదుర్కొంటోన్న భార‌త్‌కు సాయం చేస్తాం: పాకిస్థాన్ ప్ర‌క‌ట‌న‌

will help india says pak

  • పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి ట్వీట్
  • వెంటిలేటర్లతో పాటు డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాల వంటివి పంపుతాం
  • వాటిని త్వ‌ర‌గా భారత్‌కు సరఫరా చేసేలా భార‌త్‌-పాక్‌ అధికారులు కృషి చేయాలి

భార‌త్‌లో క‌రోనా కేసులు ఊహించ‌ని రీతిలో పెరిగిపోతోన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే అభివృద్ధి చెందిన ప‌లు దేశాలు భార‌త్‌కు సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, పాకిస్థాన్ కూడా భార‌త్‌కు సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి ఈ మేర‌కు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

కొవిడ్-19 విజృంభ‌ణ‌తో పోరాటం చేస్తున్న భారత్ కు సంఘీభావం తెలియజేస్తున్నామ‌ని అన్నారు. ఈ పరిస్థితుల్లో భార‌త్‌కు త‌మ వంతు సాయంగా వెంటిలేటర్లతో పాటు డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్లు వంటి వైద్య ప‌రిక‌రాలు అందించేందుకు సిద్ధమ‌ని చెప్పారు. వాటిని వీలైనంత త్వ‌ర‌గా భారత్‌కు సరఫరా చేసేలా భార‌త్‌-పాక్‌ అధికారులు కృషి చేయాలని చెప్పుకొచ్చారు. కొవిడ్‌పై చేస్తోన్న పోరాటంలో సాయం చేయడానికి ఏయే మార్గాలు ఉన్నా వాటి కోసం అన్వేషించాలని అన్నారు.

కాగా, భార‌త్‌కు ప‌లు దేశాల ప్ర‌ముఖులు  సంఘీభావం ప్రకటిస్తున్న నేప‌థ్యంలో నిన్న‌ పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కూడా దీనిపై స్పందించిన విష‌యం తెలిసిందే. భ‌యంక‌రమైన కొవిడ్-19తో పోరాడుతున్న భార‌త ప్ర‌జ‌ల‌కు త‌న‌ సంఘీభావం తెలుపుతున్నానని, కరోనాతో బాధ‌ప‌డుతున్న‌ భార‌త్‌తో పాటు ప్ర‌పంచ దేశాల‌ ప్ర‌జ‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నామని ఆయ‌న ట్వీట్ చేశారు. ప్ర‌పంచానికి స‌వాలు విసురుతోన్న క‌రోనాపై అంద‌రం క‌లిసి పోరాడాలని అన్నారు.


  • Loading...

More Telugu News