Nimmagadda Ramesh Kumar: నీలం సాహ్నీకి అభినందనలు... గవర్నర్ ను ఎందుకు కలవలేకపోయానంటే..: నిమ్మగడ్డ

Nimmagadda Wishes to new AP SEC Neelam Sahni

  • గవర్నర్ వైద్య పరీక్షలకు వెళ్లారు
  • సమయం ఉంటే పరిషత్ ఎన్నికలూ జరిపేవాళ్లం
  • హక్కుల సాధనకు పోరాడతానన్న నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించనున్న మాజీ సీఎస్ నీలం సాహ్నీకి అభినందనలు తెలియజేస్తున్నానని నేటితో పదవీ విరమణ చేయనున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకుని వెళ్లానని అన్నారు. ఇక గవర్నర్ అపాయింట్ మెంట్ తనకు లభించలేదని వచ్చిన వార్తలపై స్పందించిన ఆయన, ఇటీవల టీకాను తీసుకున్న గవర్నర్, కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లాల్సి వున్న కారణంగా,మంగళ, బుధ వారాల్లో ఎవరినీ కలవబోవడం లేదని తనకు సమాచారం అందిందని అన్నారు. త్వరలోనే గవర్నర్ ను కలిసి తాను పదవిలో ఉన్న సమయంలో తయారు చేసిన రిపోర్టును అందిస్తానని స్పష్టం చేశారు.

 ప్రభుత్వ సహకారం, సీఎస్, డీజీపీలతో పాటు ఉద్యోగులు అందించిన తోడ్పాటుతో స్థానిక ఎన్నికలను విజయవంతం చేశామని చెప్పిన ఆయన, సమయం ఉంటే పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహించి వుండేవాళ్లమని, అయితే, తనకు అంత సమయం లేకపోయిందని అన్నారు.

తనకు గతంలో తెలంగాణలో ఓటు హక్కు ఉండేదని, దాన్ని స్వగ్రామానికి మార్చుకుందామని భావించానని, తన ఓటును తాను మార్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడి నుంచైనా ఒకసారి ఓటు వేసే హక్కు ప్రతి ఒక్క పౌరుడికీ ఉందని, తన హక్కుల సాధనకు ఓ సామాన్య పౌరుడిగా రేపటి నుంచి పోరాడతానని, ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.

Nimmagadda Ramesh Kumar
Governer
Biswabhusan Harichandan
Neelam Sahni
  • Loading...

More Telugu News