India: రేపటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ తమదేనంటున్న ఇంగ్లండ్!

England Pacer Jofra Archer Confidence on Test Win
  • రేపటి నుంచి మూడో టెస్ట్
  • సిద్ధమైన భారత్, ఇంగ్లండ్ జట్లు
  • టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు కీలకం
  • గెలుస్తామన్న నమ్మకం ఉందన్న ఆర్చర్
అహ్మదాబాద్ లో రీమోడల్ చేసిన మొతేరా స్టేడియంలో రేపటి నుంచి ఇంగ్లండ్ - ఇండియాల మధ్య మూడవ టెస్ట్ డే అండ్ నైట్ మ్యాచ్ గా జరుగనుండగా, ఇరు జట్లకూ మ్యాచ్ విజయం అత్యంత కీలకంగా మారింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో చోటు సంపాదించుకోవాలంటే ఈ మ్యాచ్ గెలిచిన టీమ్ కు మంచి అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చెన్నైలో రెండు టెస్ట్ లు పూర్తి కాగా, ఇరు జట్లూ చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి.

ఈ మ్యాచ్ కి రెండు జట్లూ పూర్తి సన్నద్ధం కాగా, ఈ మ్యాచ్ గెలిస్తే, సిరీస్ ను తాము గెలిచినట్టేనని ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వ్యాఖ్యానించాడు. తాము టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే, ఈ మ్యాచ్ గెలుపు అత్యంత ఆవశ్యకమని అన్నాడు. పింక్ బాల్ పై తన అభిప్రాయాలు చెబుతూ, ఇది కూడా మామూలు బంతిలానే ఉంటుందని, ఈ బంతిని తాను చాలాసార్లు వాడానని అన్నాడు.

ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే, నాలుగో మ్యాచ్ ని తాము డ్రా చేసుకున్నా సరిపోతుందని, అందుకే ఇది అత్యంత కీలకమని చెప్పుకొచ్చిన ఆర్చర్, ఇక్కడ విజయం సాధిస్తే, చివరి మ్యాచ్ చేజారకుండా చూసుకుంటామని తెలిపాడు.

కాగా, నూతనంగా నిర్మించిన ఈ స్టేడియంలో మొత్తం లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం ఉండగా, కరోనా కారణంగా 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే తొలి టెస్ట్ కు అందుబాటులో ఉంచిన 50 వేల టికెట్లు అమ్ముడైపోయాయి.
India
England
Ahmedabad
Test Match
Pink Ball
Jofra Archer

More Telugu News