Vijayashanti: అధికార పార్టీ నేతల వల్ల చాలా సందర్భాల్లో నిందితులు తప్పించుకుంటున్నారు: విజయశాంతి
![Vijayasanthi says criminals escapes so many times by ruling party leaders](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-602fbdf0c63ae.jpg)
- తెలంగాణలో అడ్వొకేట్ దంపతుల దారుణ హత్య
- అధికార పార్టీ నేతలు నిందితులను తప్పిస్తుంటారని విజయశాంతి వ్యాఖ్యలు
- బలహీన చార్జిషీట్లు వేయిస్తారని వెల్లడి
- ప్రభుత్వం కూడా లాలూచీ ధోరణి చూపుతుందని విమర్శలు
తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్లు వామనరావు, నాగమణి దంపతుల దారుణ హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. రాష్ట్రంలో నేరస్తులు శిక్ష పడకుండా తప్పించుకుంటున్న సరళిపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. అధికార పార్టీ నేతలు చాలా సందర్భాల్లో నిందితులను తప్పించడం వల్ల నేరం చేసిన వాళ్లు తప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బలహీనమైన చార్జిషీట్లు వేయించడం, కేసుల విచారణలో సరైన శ్రద్ధ వహించకపోవడం వంటి కారణాలతో నిందితులకు శిక్షలు పడడంలేదని అభిప్రాయపడ్డారు.
ఏదో ఒక కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకున్న నేరస్తుల కేసులను పై కోర్టులలో అప్పీలు చేయకుండా ప్రభుత్వం లాలూచీ ధోరణితో వ్యవహరించడం అత్యంత దారుణం అని తెలిపారు. విచారణలో తప్పించుకున్న నేరస్తులు మరలా దారుణమైన నేరాలకు పాల్పడడడం చూస్తున్నామని వివరించారు. తెలంగాణలో ఇంతవరకు అప్పీళ్లకు పోని నేరారోపిత కేసుల వివరాలు మొత్తం ప్రభుత్వం ప్రకటించి, అందుకు గల కారణాలేంటో సమాధానం చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఆ విధంగానైనా ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.