Bandi Sanjay: కేసీఆర్ కు దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఓటర్లు చేసిన అభిషేకం సరిపోయినట్టు లేదు... మరో డ్రామాకు తెరదీశారు: బండి సంజయ్

  • ఇటీవల తెలంగాణ పీఆర్సీ నివేదిక విడుదల
  • నివేదికలోని పలు అంశాలపై ఉద్యోగుల అసంతృప్తి!
  • బిస్వాల్ కమిటీ నివేదికపై అభిప్రాయ సేకరణ
  • అనుకూల సంఘాలనే పిలుస్తున్నారంటూ సంజయ్ ఆరోపణ
  • అన్ని సంఘాలను పిలవాలని డిమాండ్
  • ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ
Bandi Sanjay slams CM KCR over PRC Report

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగులకు పీఆర్సీ నివేదిక విడుదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. పాలాభిషేకాల కోసం తాపత్రయపడే సీఎం మళ్లీ ఒక కొత్త డ్రామాకు తెరదీశారని విమర్శించారు. సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నివేదికపై అభిప్రాయసేకరణకు తనకు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాలనే పిలుస్తున్నారని ఆరోపించారు. తన అనుకూల సంఘాలతోనే చర్చించి వాళ్లతో పాలాభిషేకాలు చేయించుకోవాలనుకుంటున్నాడని విమర్శించారు. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఓటర్లు చేసిన అభిషేకం సరిపోయినట్టు లేదని ఎద్దేవా చేశారు.

బిస్వాల్ కమిటీ నివేదికపై అభిప్రాయ సేకరణకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలను చర్చలకు పిలవాలన్నదే తమ డిమాండ్ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ నివేదిక రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్ దారులను నట్టేట ముంచినట్టుగా ఉందని లక్షల మంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే సీఎం ఎక్కడ పడుకున్నాడని ప్రశ్నించారు. ఈ అంశంపై ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

"7.5 ఫిట్ మెంట్ ను ముందుకు తీసుకురావడం ద్వారా, ఇప్పటికే పెండింగ్ లో ఉన్న అనేక అంశాలను తెరపైకి రాకుండా కేసీఆర్ కుట్ర చేశాడు. కేసీఆర్ పన్నాగం ప్రకారమే త్రిసభ్య కమిటీ చర్చ అంతా ఫిట్ మెంట్ వైపు మళ్లింది. 2014లో కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఉద్యోగులకు కల్పించాల్సిన ఈహెచ్ఎస్ అమలు కావడంలేదు, ఎక్కడా నగదు రహిత చికిత్స జరగడంలేదు. కరోనా బాధిత ఉద్యోగులకు లక్ష సాయం చేస్తామని చేతులు దులుపుకున్నారు. కరోనా బారినపడిన ఉద్యోగులు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని అప్పులపాలయ్యారు.

అటు ఎన్జీవోలకు ఎల్టీసీ లేకుండా పోయింది. భార్యాభర్తల బదిలీలు ఇంకెప్పుడు చేస్తారు? త్రిసభ్య కమిటీ ముందు ఈ అంశాలన్నీ చర్చకు రావాల్సిందే. ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగులు మండిపడుతుంటే సీఎం కేసీఆర్ కు పేను కుట్టినట్టుగా కూడా లేదు. గొంతెత్తి ప్రశ్నించేవాళ్లను కేసుల పేరుతో బెదిరిస్తున్నారు. ఉద్యోగులను వేధిస్తే ఊరుకునేది లేదు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంది. ఉద్యోగ బంధువులారా... మీరు ఎవరికీ భయపడొద్దు. మీకు బీజేపీ అండగా ఉంది" అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

More Telugu News