USA: చైనా విస్తరణ వాదంపై అమెరికా సీరియస్​!

  • ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని హెచ్చరిక
  • జపాన్ సెంకాకు దీవులను కాపాడతామన్న అధ్యక్షుడు బైడెన్
  • తైవాన్ పైకి యుద్ధ విమానాలను పంపడంపై విదేశాంగ శాఖ మండిపాటు
  • భారత్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలతో అమెరికా రక్షణ మంత్రి ఫోన్ చర్చలు
In multiple messsages Biden warns Beijing over expansionism

చైనా విస్తరణ, ఆక్రమణవాదంపై అమెరికా సీరియస్ గా ఉంది. తూర్పు, ఆగ్నేయాసియాల్లో ఆ దేశ ఆక్రమణలపై మండిపడింది. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ లోని భూభాగాలు తమవేనని ప్రకటించి వాటిని కలిపేసుకోవాలని తాపత్రయ పడుతున్న చైనాకు హెచ్చరికలు పంపింది.

బుధవారం జపాన్ ప్రధాని యోషిహిడే సూగాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు.. సెంకాకు దీవులను చైనా నుంచి కాపాడేందుకు సాయం చేస్తామన్నారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా అదే హామీ ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చైనా విస్తరణ వాదాన్ని అనుమతించబోమని చెప్పారు. ఇటు, ఇప్పటికే ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాల రక్షణ మంత్రులతోనూ ఆయన మాట్లాడారు.

ఇటు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ కూడా చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ లోని రక్షణ జోన్ లోకి పదుల సంఖ్యలో యుద్ధ విమానాలను, బాంబర్లను పంపడంపై మండిపడ్డారు. ఇండో–పసిఫిక్ రీజియన్ లోని తమ మిత్రుల సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అండగా ఉంటామని తేల్చి చెప్పారు.

ఇక, ఇప్పటికే జనవరి 24న బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాలుగో రోజే.. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యూఎస్ఎస్ థియోడోర్ రూజ్ వెల్ట్ ఫ్రీడమ్ నావిగేషన్ పేరిట దక్షిణ చైనా సముద్రంలో ప్రయాణించింది. తమ జలాలు అని చైనా చెప్పుకునే చోటుకు అతి దగ్గరగా వెళ్లింది.

More Telugu News