India: 9 నెలల తరువాత ఢిల్లీలో అదుపులోకి వచ్చిన మహమ్మారి!

  • 100కు దిగువన కొత్త కేసుల సంఖ్య
  • ఏప్రిల్ తరువాత అతి తక్కువ కేసులు
  • దేశంలోని 147 జిల్లాల్లో నమోదు కాని కొత్త కేసులు

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో కేవలం 96 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. గడచిన 9 నెలల వ్యవధిలో ఢిల్లీలో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

ఏప్రిల్ లో న్యూఢిల్లీలో ఒకరోజు కేసుల సంఖ్య 100 దాటగా, ఆపై ఓ దశలో రోజుకు 10 వేలకు పైగా కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే. కరోనా రెండో దశ తరువాత, మూడో దశ రానుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేసినప్పటికీ, కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.

కరోనా లాక్ డౌన్ అత్యంత కఠినంగా అమలవుతున్న రోజుల్లో వేలల్లో కొత్త కేసులు వచ్చిన ప్రాంతంలో, ఇప్పుడు నిబంధనలన్నీ తొలగించి, అన్ని రకాల కార్యకలాపాలూ సజావుగా సాగుతున్న వేళ, కొత్త కేసుల సంఖ్య 100కు దిగువకు పడిపోవడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.

 నిన్న మొత్తం 30 వేలకు పైగా పరీక్షలు నిర్వహించామని, పాజిటివిటీ రేటు ఒక శాతం కన్నా దిగువకు పడిపోయిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ పేర్కొంది. మూడు రోజుల క్రితం జరిగిన రిపబ్లిక్ వేడుకల తరువాత కేసుల సంఖ్య పెరగవచ్చని అంచనా వేశామని, కానీ అలా జరగలేదని పేర్కొన్న అధికారులు, మరో నాలుగైదు రోజులు పరిస్థితిని సమీక్షించాల్సి వుందని అన్నారు.

ఓ దశలో పరీక్షలు చేసిన నమూనాల సంఖ్యతో పోలిస్తే, పాజిటివిటీ రేటు 15 శాతం వరకూ ఉండగా, ఇప్పుడది కేవలం 0.32 శాతానికి తగ్గిందని అధికారులు అంటున్నారు. ఢిల్లీలో ఇప్పటివరకూ 6,34,325 మందికి కరోనా సోకగా, వీరిలో 6.20 లక్షల మందికి పైగా చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారు. 10,829 మంది మరణించారు. రికవరీ రేటు 98 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.7 శాతంగా ఉంది.

ఇదిలావుండగా, ఇండియాలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్ర, కేరళలోనే 70 శాతం కేసులు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ 153 యూకే స్ట్రెయిన్ కేసులను గుర్తించామని అన్నారు. గడచిన వారం రోజుల వ్యవధిలో దేశంలోని 147 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన తెలిపారు.

18 జిల్లాల్లో రెండు వారాలుగా, 6 జిల్లాల్లో మూడు వారాలుగా, 21 జిల్లాల్లో నాలుగు వారాలుగా కొత్త కేసులు రాలేదని, కరోనాపై ఇండియా విజయం సాధిస్తుందనడానికి ఇది సంకేతమని ఆయన అన్నారు. కాగా, బుధవారం నాడు ఇండియాలో 11,666 కొత్త కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

More Telugu News