Yanamala: పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా గవర్నర్ బాధ్య‌త తీసుకోవాలి: య‌న‌మ‌ల‌

  • ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది
  • అయినా ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌ట్లేదు
  • ఈ తీరు దేశ చరిత్రలోనే ఎక్క‌డా లేదు
  • జగన్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు
yanamala slams ysrcp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలి ద‌శ‌ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేష‌న్ విడుద‌లైన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు స‌హక‌రించ‌క‌పోతుండ‌డంతో దీనిపై టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా ఇటువంటి తీరు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం దేశ చరిత్రలోనే ఎక్క‌డా లేదని ఆయ‌న విమ‌ర్శించారు.

స్థానిక పాలన అందించటంలో రాష్ట్ర‌ ప్రభుత్వం విఫలమైందని  తెలిపారు. ప్ర‌భుత్వ మాట‌లు వింటూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడడం స‌రికాద‌ని ఉద్యోగులకు హిత‌వు ప‌లికారు. ఎన్నిక‌ల విధుల్లో అధికార యంత్రాంగాన్ని పాల్గొనకుండా చేయడం ద్వారా ముఖ్య‌మంత్రి జగన్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్న జ‌గ‌న్ తగిన మూల్యం చెల్లించుకుంటార‌ని తెలిపారు.

పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా గవర్నర్‌ తన అధికారాల‌ను వినియోగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. రాజ్యాంగానికి లోబడి త‌మ విధులు నిర్వ‌ర్తిస్తామ‌ని ప్రమాణం చేసి పనిలో చేరిన‌ ఉద్యోగులు, అధికారులు ఆ విష‌యాన్ని గుర్తు చేసుకోవాలని ఆయ‌న చెప్పారు. ప్రభుత్వాలు మారుతుంటాయ‌ని, అధికార యంత్రాంగమే శాశ్వతంగా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

More Telugu News