Moderna: మోడెర్నా వ్యాక్సిన్​ తో దుష్ప్రభావాలు చాలా అరుదు: అమెరికా ప్రకటన

  • 40.41 లక్షల మందికి టీకా వేస్తే 10 మందికే సైడ్ ఎఫెక్ట్స్ అన్న సీడీసీ
  • 13 నిమిషాల్లోనే చెడు లక్షణాలు కనిపించాయని వెల్లడి
  • వెంటనే ట్రీట్ మెంట్ చేయడంతో ప్రాణాపాయం తప్పిందని ప్రకటన
  • నాలుక వాపు, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి దుష్ప్రభావాలు వచ్చాయన్న సంస్థ
Moderna coronavirus vaccine rarely causes severe allergic reactions

అమెరికా సంస్థ మోడెర్నా తయారు చేసిన కరోనా టీకాతో దుష్ప్రభావాలు చాలా చాలా అరుదని ఆ దేశ వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. మోడెర్నా టీకాకు సంబంధించిన సమాచారాన్ని వివరించింది. గత ఏడాది డిసెంబర్ 21 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు 40 లక్షల 41 వేల 396 మందికి ఆ టీకాను వేస్తే.. కేవలం 10 మందికే అత్యంత తీవ్రమైన దుష్ప్రభావాలు వచ్చాయని తెలిపింది. అయితే, వెంటనే ట్రీట్ మెంట్ చేయడం ద్వారా ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలుగలేదని పేర్కొంది.

వారిలో దుష్ప్రభావాలు కలుగడానికి గల కారణాలేంటన్న దానిపై ఇంకా స్పష్టత లేదని, కానీ, పది మందిలో తొమ్మిది మందికి వ్యాక్సిన్ కు ముందే అలర్జీలు ఉన్నాయని సీడీసీ తెలిపింది. అందులో ఐదుగురికి అనాఫైలాక్సిస్ (ఆహారం, మందుల వల్ల కలిగే తీవ్రమైన దుష్ప్రభావం/అలర్జీ) ఉందని వెల్లడించింది.

దుష్ప్రభావాలు కలిగిన ఆ పది మందిలో తొమ్మిది మందికి వ్యాక్సిన్ వేసుకున్న 13 నిమిషాల్లోనే వాంతులు, వాంతి వచ్చినట్టు అనిపించడం, ఊపిరి తీసుకోలేకపోవడం, నాలుక వాపు, దద్దుర్లు వంటి దుష్ప్రభావాలు వచ్చాయని పేర్కొంది. కాగా, మోడెర్నా టీకాను అత్యధికంగా మహిళలకే వేసినట్టు చెప్పింది. ఈ టీకా తీసుకున్నవారిలో మహిళల వాటానే 24 లక్షల 65 వేల 411 (61%) అని పేర్కొంది. 14 లక్షల 50 వేల 966 మంది పురుషులకు మోడెర్నా టీకాను ఇచ్చారని, మరో 3 శాతం మంది (లక్షా 25 వేల 19) మాత్రం తమ జెండర్ ను రికార్డ్ చేయలేదని చెప్పింది.

More Telugu News