Rafale: భారత్ సైనిక సత్తా... ఎల్లుండి జరిగే గణతంత్ర వేడుకల విశేషాలివి!

  • తొలిసారిగా కనువిందు చేయనున్న రఫేల్ విమానాలు
  • పాల్గొననున్న తొలి మహిళా పైలెట్ భావనా కాంత్
  • పరిమిత సంఖ్యలో మాత్రమే వీక్షకులకు అనుమతి
  • పలు రాష్ట్రాల తరఫున వినూత్న థీమ్ లతో శకటాలు
  • నాలుగో సారి ముఖ్య అతిథి లేకుండా విన్యాసాలు
Details of Day After Tomorrows Republic Day

ఓ వైపు కరోనా, మరోవైపు ఆంక్షలు... ఈ నేపథ్యంలో 26న జరిగే గణతంత్ర వేడుకలకు గతంతో పోలిస్తే, ఏ మాత్రమూ తగ్గకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున సందర్శకులు లేకున్నా, కొత్త శకటాలు, సైన్యం చేతిలో ఉన్న ఆయుధాలను ప్రదర్శించి, వాటిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు చూపించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రతి సంవత్సరమూ లక్షలాది మంది ఈ వేడుకలను నేరుగా తిలకిస్తుండగా, ఈ సంవత్సరం మాత్రం కేవలం 25 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

ఇక వేడుకల్లో విశేషాలను పరిశీలిస్తే...
ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు తొలిసారిగా పరేడ్ లో భాగం కానున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ లో ఈ విమానాలు భారత వాయుసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇక తొలి మహిళా ఫైటర్ విమానాల పైలెట్ భావనా కాంత్ ఈ ప్రదర్శనలో భాగం పంచుకోనున్నారు. పలు రకాల తేలికపాటి యుద్ధ విమానాలతో పాటు సుఖోయ్-30 జెట్లు కూడా కనువిందు చేయనున్నాయి.

ఇక రిపబ్లిక్ వేడుకల్లో తొలిసారిగా లడ్డాఖ్ భాగం కాబోతోంది. లేహ్ లో భాగమైన థిక్సే కొండలపై ఓ పర్యాటక కేంద్రంగా ఉన్న చారిత్రక మఠం నమూనా తొలిసారిగా ప్రదర్శితం కాబోతుండగా, యూపీలో నిర్మితం కానున్న రామాలయం నమూనా, ఏపీకి సంబంధించి లేపాక్షీ థీమ్ తో శకటం ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. భారత నావికాదళం నుంచి 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఐఎన్ఎస్ విక్రాంత్ నమూనా శకటం రానుంది.

ఇదిలావుండగా, అదే రోజున ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు హస్తినలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించనున్నారు. దీనికి ఇప్పటికే పోలీసుల నుంచి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక, మరో దేశం నుంచి ప్రత్యేక అతిథి లేకుండా రిపబ్లిక్ వేడుకలు జరగడం ఇది మూడోసారి. గతంలో 1952, 1953, 1956 సంవత్సరాల్లో గెస్ట్ లేకుండానే వేడుకలు జరిగాయి. ఈ సంవత్సరం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, తాను వచ్చేందుకు అంగీకరించినా, బ్రిటన్ లో కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడింది.

ఇక ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చే మీడియా ప్రతినిధుల సంఖ్యను 300 నుంచి 200కు తగ్గించారు. పరేడ్ లో విద్యార్థుల ప్రదర్శనలను రద్దు చేశారు. 15 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి అనుమతి లేదు. పరేడ్ జరిగే సమయాన్ని కూడా రద్దు చేశారు. మాజీ సైనికాధికారులు, మహిళా అధికారుల కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. సీఆర్పీఎఫ్ కమాండోల ఆధ్వర్యంలో జరిగే మోటార్ సైకిల్ విన్యాసాలు కూడా కనిపించవు.

More Telugu News