Sand: ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందంటూ మోసం.. 50 లక్షలకు టోపీ!

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన పూణె నగల వ్యాపారి
  • ఏడాది క్రితం పరిచయం.. కుటుంబంతోనూ స్నేహం
  • రూ.30 లక్షలు, రూ.20 లక్షల విలువైన బంగారం దోపిడీ
Heating sand will make it gold Man cheats Pune jeweller of Rs 50 lakh with sand bags

తిమిరి ఇసుక నుంచి తైలంబు తీయవచ్చు అని పెద్దలు చెప్పిన మాట. నూనె వస్తుందో రాదో తెలియదుగానీ.. బంగారం వస్తుందంటూ ఓ మోసగాడు ముంచేశాడు. ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందని ఓ కేటుగాడు చెప్పిన మాటలు నమ్మి మహారాష్ట్రలోని పూణెకి చెందిన ఓ వ్యాపారి రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు.

పూణెలోని హదాస్ పూర్ కు చెందిన ఓ నగల వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది క్రితం ఆ వ్యాపారి షాపుకు వెళ్లిన ఓ వ్యక్తికి.. వ్యాపారితో రాను రాను పరిచయం పెరిగింది. ఆ వ్యాపారి కుటుంబంతోనూ స్నేహం ఏర్పడింది. ఆ క్రమంలోనే అతడి ఇంటికి పాల ఉత్పత్తులను నిందితుడు సరఫరా చేసేవాడు. అయితే, ఓ రోజు 4 కిలోల ఇసుక సంచిని తీసుకొచ్చి నగల వ్యాపారికి ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన ఇసుక అని, వేడి చేస్తే బంగారం అవుతుందని నమ్మించాడు.  

అతడి మాటల్లో మోసాన్ని గ్రహించలేకపోయిన వ్యాపారి.. నిజమే కావొచ్చు అనుకుని రూ.30 లక్షలు, రూ.20 లక్షల విలువైన బంగారం ముట్టజెప్పాడు. తర్వాత ఆ ఇసుకను వేడి చేసిన వ్యాపారి.. తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News