Tollywood: ‘సూపర్‌ ఓవర్‌’ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో హీరో, హీరోయిన్ల క‌న్నీరు!

  • ‘సూపర్‌ ఓవర్‌’ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ ఇటీవ‌ల‌ మృతి
  • షూటింగ్ మిగతా భాగాన్ని పూర్తి చేసిన సుధీర్ వ‌ర్మ‌
  • ప్ర‌వీణ్ ను గుర్తు చేసుకున్న  హీరోయిన్  చాందిని, హీరో నవీన్ ‌చంద్ర
hero heroin get emotion

క్రికెట్‌ బెట్టింగ్ స్టోరీతో రూపుదిద్దుకున్న టాలీవుడ్ సినిమా ‘సూపర్‌ ఓవర్‌’ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ఆ సినిమా హీరో, హీరోయిన్లు తీవ్ర భావోద్వేగానికి గురై క‌న్నీరు పెట్టుకున్నారు.  ఈ సినిమాలో ‘కలర్‌ఫొటో’ సినిమా హీరోయిన్  చాందినీ చౌదరి, యంగ్ హీరో నవీన్ ‌చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.  

ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్ ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉన్నప్పుడు కారు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నేప‌థ్యంలో మిగిలిన షూటింగ్‌ను సుధీర్‌ వర్మ పూర్తి చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌వీణ్ వ‌ర్మ‌తో సినిమా షూటింగ్ స‌మ‌యంలో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకుని చాందిని క‌న్నీరు పెట్టుకుంది.

‘సూపర్‌ ఓవర్‌’ సినిమా ప్రేక్ష‌కులకు నచ్చుతుందని ఆశిస్తున్నానని తెలిపింది. ఈ సినిమాలో తన‌ను భాగం చేసినందుకు ప్రవీణ్‌కు ధ‌న్య‌వాదాలు చెబుతున్న‌ట్లు తెలిపింది. ప్ర‌వీణ్ వ‌ర్మ ఎక్కడ ఉన్నా ఈ సినిమాను చూసి సంతోషిస్తాడని అనుకుంటున్నాన‌ని భావోద్వేగానికి గురైంది.

 ఆ త‌ర్వాత న‌వీన్ చంద్ర కూడా మాట్లాడుతూ.. ప్రవీణ్‌వర్మ చాలా మంచి వ్యక్తని అన్నాడు. ఇప్పుడు ఆయన త‌మ మధ్య లేనందుకు చాలా బాధగా ఉందని చెప్పాడు. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌ గురించి మాట్లాడడం కూడా కష్టంగా ఉందని క‌న్నీరు పెట్టుకున్నాడు. ఆయ‌న‌ ఆశయాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను సుధీర్ పూర్తి చేశార‌ని చెప్పాడు. ఈ సందర్భంగా సుధీర్‌కు థ్యాంక్స్ చెప్పాడు.  

More Telugu News