Varla Ramaiah: ఏపీ ఎన్నిక‌ల సంఘానికి వ‌ర్ల రామ‌య్య లేఖ‌

  • గ్రామ వాలంటీర్ల‌ను ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు దూరంగా ఉంచాలి
  • ఎన్నిక‌ల సిబ్బందికి ఇత‌ర ప్రాంతాల్లో  విధులు ఇవ్వాలి
  • కేంద్ర భ‌ద్ర‌తా ద‌ళాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌పాలి
varla ramaiah writes letter to sec

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో  రాష్ట్ర‌ ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ నేత‌ వ‌ర్ల రామ‌య్య లేఖ రాశారు. గ్రామ వాలంటీర్ల‌ను ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు దూరంగా ఉంచాల‌ని ఆయ‌న కోరారు. ఎన్నిక‌ల అధికారుల‌తో పాటు సిబ్బందికి వారి సొంత డివిజ‌న్ల‌లో కాకుండా ఇత‌ర ప్రాంతాల్లోని డివిజ‌న్ల‌లో విధులు ఇవ్వాల‌ని అన్నారు.

అలాగే, ఈ ఎన్నిక‌లు కేంద్ర భ‌ద్ర‌తా ద‌ళాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్వ‌హించాల‌ని ఆయ‌న కోరారు. అన్ని పోలింగ్ కేంద్రాల వ‌ద్ద సీసీటీవీ నిఘాలు ఏర్పాటు చేయాల‌ని అన్నారు. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ దృష్ట్యా ప్ర‌జ‌ల‌తో పాటు అధికారులు వైర‌స్ బారిన ప‌డ‌కుండా నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ఆయ‌న చెప్పారు.

కాగా, ఎన్నిక‌లు నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన త‌ర్వాత కూడా ఏపీ ప్ర‌భుత్వం అందుకు సుముఖంగా లేక‌పోవ‌డం, సుప్రీంకోర్టుకు వెళ్ల‌డంతో ఎన్నికల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతోంది. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేందుకు ఎస్ఈసీ సిద్ధ‌మ‌య్యారు.

మరోవైపు, ఏపీలో ప‌రిస్థితుల‌పై డీజీపీ స‌వాంగ్ ను వ‌ర్ల రామ‌య్య ట్విట్ట‌ర్ లో నిల‌దీశారు. 'డీజీపీ గారూ! చంద్రబాబు వాహనంపై రాళ్లతో, చెప్పులతో, కర్రలతో దాడి చేస్తే, అది, రాజ్యాంగం, ప్రజలకిచ్చిన"స్వేచ్ఛ" అని సెలవిచ్చారు, ఏ చర్యలూ తీసుకోలేదు. మరి, ఏ1 విజయసాయిరెడ్డి కారుపై వాటర్ బాటిల్ పడితే, అది, ఏ రకంగా ఆయనపై హత్యాయత్నం అయింది సార్. ఈ చిక్కుముడి విప్పి ప్రజలకు చెప్పండి' అని ఆయ‌న నిల‌దీశారు.

More Telugu News