Pawan Kalyan: జీహెచ్ఎంసీలాగే తిరుప‌తి ఉప ఎన్నికను కూడా బీజేపీ జాతీయ నేత‌లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకోవాలి: ప‌వ‌న్

  • క‌రోనా వ‌ల్ల రాష్ట్ర బీజేపీ నేత‌లతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేక‌పోయాం
  • తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఎవ‌రు పోటీ చేయాల‌న్నది నిర్ణ‌యిస్తాం
  • ఈ విష‌యంపై వారం రోజుల్లో చ‌ర్చ‌లు జ‌రిపి నిర్ణ‌యం
  • స‌మ‌న్వ‌యంతో క‌లిసి ప‌నిచేస్తాం
will take decision on tirupati by elections

తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌-బీజేపీ పోటీ చేయ‌డంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు.  ఈ రోజు ఆయ‌న తిరుప‌తిలో మీడియాతో మాట్లాడుతూ... 'బీజేపీ జాతీయ నాయ‌కత్వంతో మాకున్న అవ‌గాహ‌న చాలా బ‌లంగా ఉంది.  అయితే,  రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేత‌ల‌తో అవ‌గాహ‌న లోపించింది. క‌రోనా వ‌ల్ల రాష్ట్ర బీజేపీ నేత‌లతో కూర్చొని చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేక‌పోయాం' అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.

'తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఎవ‌రు పోటీ చేయాల‌న్న విష‌యంపై వారం రోజుల్లో చ‌ర్చ‌లు జ‌రిపి నిర్ణ‌యం తీసుకుంటాం. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌, బీజేపీ నేత‌ల్లో ఎవ‌రు పోటీ చేసిన‌ప్ప‌టికీ స‌మ‌న్వ‌యంతో క‌లిసి ప‌నిచేస్తాం. తెలంగాణ‌లో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లను ఎలా అయితే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని పోటీ చేశామో, అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తిరుప‌తి ఉప ఎన్నిక‌ను కూడా తీసుకోవాలి. రాష్ట్రానికి ఈ ఉప ఎన్నిక చాలా ముఖ్యం' అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.

'జ‌న‌సేన‌-బీజేపీ ఏపీలో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శక్తి అని చెప్ప‌డానికి తిరుప‌తి ఉప ఎన్నిక చాలా కీల‌కం. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ జాతీయ స్థాయి నేత‌లు ఎలా బ‌లంగా మ‌ద్ద‌తు తెలిపారో ఈ ఉప ఎన్నికకు కూడా అదే స్థాయిలో మ‌ద్ద‌తు తెల‌పాలి. జ‌న‌సేన ఎంత శ‌క్తిమంతంగా ఉంద‌నే విష‌యంపై రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగేలా చేయాల‌ని బీజేపీ జాతీయ స్థాయి నేత‌లు మాకు చెప్పారు. త‌ప్ప‌కుండా స‌మావేశం ఏర్పాటు చేసి, బీజేపీ రాష్ట్ర నాయ‌కుల‌కు ఆ విషయం చెబుతాం. క‌రోనా వ‌ల్ల కొన్నినెల‌లుగా బీజేపీ రాష్ట్ర నేత‌ల‌ను క‌ల‌వ‌లేదు త‌ప్ప ఇందులో మ‌రే ఉద్దేశం లేదు' అని ప‌వ‌న్ క‌ల్యాణ్ వివరించారు.

More Telugu News