Bopparaju: ఎన్నికల ప్రక్రియ నిలిపివేసేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలి: జేఏసీ చైర్మన్ బొప్పరాజు

  • స్థానిక ఎన్నికలు జరపాలంటూ హైకోర్టు తీర్పు
  • వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే ఎన్నికలు జరపాలన్న బొప్పరాజు
  • ఉద్యోగుల ప్రాణాలకు ఎస్ఈసీ బాధ్యత వహించాలని వ్యాఖ్యలు
  • రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్న ఉద్యోగ సంఘాలు
Bopparaju wants Governor interference in local body polls

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరపాలంటూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని, తనకున్న విచక్షణాధికారాలతో ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటే వారికి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమా? అని బొప్పరాజు ప్రశ్నించారు. లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరికీ పీపీఈ కిట్లు ఇవ్వడం వీలయ్యే పనేనా? అని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఎస్ఈసీ రమేశ్ కుమార్, ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల అంశంపై ఉద్యోగుల తరఫున ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.

రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం: ఉద్యోగ సంఘాలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు వెల్లడించాయి. గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు.

అటు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఓవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్న వేళ, ఎన్నికలు ఎలా జరుపగలరని ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించిన పలు రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరిగాయని, ఎస్ఈసీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.

More Telugu News