COVID19: వ్యాక్సిన్​ వేసుకున్నా కరోనా వచ్చే చాన్స్​: సీరమ్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​

  • తీవ్రత అంతగా ఉండదు.. లక్షణాలూ కనిపించవు
  • మొదటి, రెండో డోసుకు మధ్య టైంను పెంచితే మంచి ఫలితాలు
  • 28 రోజుల గ్యాప్ తో 8‌‌0 శాతం వరకు ఫలితాలు
  • దానికి మరో 10 వారాలు పెంచితే మరింత ఎక్కువ ప్రభావం
Vaccine More Effective If Longer Gap Between Doses

కరోనా కోరలు విరిచేసే కార్యక్రమం మొదలైపోయింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఫస్ట్ డోస్ టీకా వేసుకున్నాక 28 రోజులకు రెండో డోస్ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే, మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే అంత మంచిదని కొవిషీల్డ్ ను తయారు చేసిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చెబుతోంది.

రెండు డోసుల మధ్య రోజుల తేడాను మరికొన్ని వారాలు పెంచితే టీకా ప్రభావం మరింత పెరుగుతుందని సీరమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాధవ్ చెప్పారు. ‘‘రెండు డోసుల మధ్య తేడా నాలుగు వారాలైనా మంచి ఫలితాలే వస్తాయి. కరోనా నుంచి టీకా రక్షణ ఇస్తుంది. అయితే దాని ప్రభావం 70 నుంచి 80 శాతమే ఉంటుంది. రెండో డోసు వేసుకోవడానికి 28 రోజులకు మరో ఆరు వారాలు లేదా 8 లేదా 10 వారాల టైంను పెంచితే మరింత మంచి ఫలితాలు వస్తాయి’’ అని ఆయన వివరించారు.

28 రోజుల తేడా ప్రాతిపదికనే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేశామని, ఇప్పుడు వ్యాక్సినేషన్ కూ దానినే ప్రామాణికంగా తీసుకున్నారని సురేశ్ చెప్పారు. కరోనా నుంచి దీర్ఘకాలిక రక్షణ కావాలంటే టైం గ్యాప్ ను పెంచితే బాగుంటుందన్నారు. కరోనా సోకినా కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కరోనా వచ్చినోళ్లకూ మళ్లీ సోకుతోందని, కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటేనే మంచిదని చెప్పారు.

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చే అవకాశాలున్నాయని ఆయన తేల్చి చెప్పారు. అన్ని జబ్బుల్లాగే ఇది కూడా అని అన్నారు. అయితే, టీకా వేసుకున్న తర్వాత కరోనా సోకినా అంత తీవ్రంగా మాత్రం ఉండదని, లక్షణాలు కూడా కనిపించవని వివరించారు.  ఏదో ఒక కంపెనీ వ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలని, వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లు ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దని చెప్పారు. రెండు రకాల టీకాల్లో వాడే టెక్నాలజీ వేరని, కాబట్టి ఫస్ట్ డోసు టైంలో ఏ కంపెనీ టీకా అయితే తీసుకున్నారో.. రెండో డోసుకూ అదే కంపెనీ టీకా తీసుకోవాలని సూచించారు.

More Telugu News