Talasani: గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: వీడియో విడుద‌ల చేసిన మంత్రి త‌ల‌సాని

talasani releases video

  • అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి
  • కోకాపేటలో జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడాను
  • గంగ‌పుత్రుల‌ మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడ‌లేదు
  • అలా మాట్లాడానని అనిపిస్తే క్షమాపణలు చెబుతా

"తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. కోకాపేటలో జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు" అంటూ తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్  వీడియో రూపంలో మాట్లాడారు.

గంగపుత్రుల మనోభావాలు కించపరిచేలా తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, ఒక‌వేళ‌ వారి మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడానని అనిపిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమ‌ని చెప్పారు. కేసీఆర్ గంగపుత్రులకు చెరువులు, కుంటలు మీద సర్వాధికారాలు ఇవ్వాలని అసెంబ్లీలో చెప్పిన విష‌యాన్నే తాను ప్రస్తావించానని తెలిపారు.

తాను వారి‌ని ఉత్సాహ‌ప‌ర్చ‌డానికే కొన్ని మాట‌లు మాట్లాడాన‌ని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు గంగ‌పుత్రుల‌ను ప‌ట్టించుకునేవారే లేర‌ని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక వారి సంక్షేమం కోసం కృషి చేస్తోంద‌ని తెలిపారు.

కాగా, ‌ఇటీవ‌ల‌ ఓ కార్య‌క్ర‌మంలో త‌మ‌ పట్ల మంత్రి తలసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, వెంటనే ఆయనను రాష్ట్ర‌ మంత్రి పదవి నుంచి తొల‌గించా‌ల‌ని అఖిల భారత గంగపుత్ర సంఘం డిమాండ్ చేస్తోంది. ఆయ‌న వ్యాఖ్యలు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే త‌ల‌సాని వీడియో విడుద‌ల చేశారు.


  • Loading...

More Telugu News