India: 3 లక్షల టార్గెట్... తొలి రోజు మొత్తం 1.91 లక్షల మందికే కరోనా టీకా!

  • తక్కువగా ఉన్న కొవిన్ యాప్ రిజిస్ట్రేషన్లు
  • ఢిల్లీ ఎయిమ్స్ లో మొదలైన వ్యాక్సినేషన్
  • తొలి రోజు టార్గెట్ ను అందుకోలేక పోయిన ఆరోగ్య శాఖ
Vaccination Miss the Target in First Day

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇండియాలో మొదలైపోయింది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాలోని ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించగా, పారిశుద్ధ్య కార్మికుడు మనీష్ కుమార్ తొలి టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ఈ కార్యక్రమం మొదలైంది. మొత్తం 3 వేల సెంటర్ల నుంచి 3 లక్షల మందికి తొలి రోజున వ్యాక్సిన్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకోగా, దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికి టీకాను ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకునే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయని, అందుకనే 'కోవిన్' యాప్ రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నాయని, సమయం గడిచేకొద్దీ వ్యాక్సిన్ కు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. తొలిరోజు కరోనా డ్రైవ్ విజయవంతం అయిందని తెలిపాయి. అయితే, ప్రభుత్వ లక్ష్యాన్ని, టీకా గణాంకాలను పరిశీలిస్తే, లక్ష్యాన్ని అందుకోలేకపోయినట్టేనని ఆరోగ్య శాఖ నిపుణులు వ్యాఖ్యానించారు.

"నా సహచర ఉద్యోగుల్లో చాలా మంది టీకాను వేసుకునేందుకు భయపడ్డారు. నేను అప్పుడు నా సీనియర్ల వద్దకు వెళ్లి తొలి టీకాను తీసుకుంటానని స్పష్టం చేశాను. భయపడాల్సిన అవసరం లేదని చెప్పడమే నా ఉద్దేశం. నా భార్య కూడా వ్యాక్సిన్ వద్దనే చెప్పింది. ఇది కేవలం ఓ ఇంజక్షన్ మాత్రమే అని నేను ఆమెకు సర్ది చెప్పాను. టీకా డోస్ తీసుకున్న తరువాత మా అమ్మకు, భార్యకు నేను క్షేమంగానే ఉన్నానని చెప్పాను" అని కుమార్ వ్యాఖ్యానించాడు.

కాగా, వచ్చే 6 నుంచి 8 నెలల్లో ఇండియాలోని 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలన్న లక్ష్యంతో కేంద్రం కార్యాచరణ రూపొందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ లనూ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇస్తున్నారు.

More Telugu News