USA: అమెరికాకు వెళ్లాలంటే తడిసిమోపెడు.. భారీగా పెరిగిన ‘వన్​ వే’ విమాన చార్జీలు

  • కరోనాతో రెట్టింపైన టికెట్ ధరలు
  • తక్కువలో తక్కువ రూ.లక్ష పెట్టాల్సిందే
  • మార్గాన్ని బట్టి కనీస చార్జీ రూ.95 వేల నుంచి రూ.1.4 లక్షలు
  • స్టూడెంట్లపైనే అధిక భారమంటున్న అధికారులు
Covid norms see 1 way US fares fly past Rs 1 lakh

అమెరికాకు వెళ్లాలంటే తడిసిమోపెడవ్వాల్సిందే. ఎన్నడూ లేనంతగా విమాన చార్జీలు పెరిగిపోయాయి మరి. అది కూడా మన భారతీయులకే.. కేవలం ‘వన్ వే’ ప్రయాణానికే! కరోనాకు ముందున్న ధరల కన్నా దాదాపు రెట్టింపయ్యాయి చార్జీలు. మన దేశం నుంచి అగ్రరాజ్యానికి వెళ్లాలంటే కనీసం లక్ష రూపాయలు వదిలించుకోవాల్సిందే.

ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలకు విమానాలు నడుస్తున్నాయి. మంగళవారం ముంబై నుంచి న్యూయార్క్, ముంబై నుంచి నెవార్క్ వెళ్లే విమానాలకు అతి తక్కువ చార్జీలు వరుసగా రూ.లక్ష, రూ.1.4 లక్షలు అంటేనే టికెట్ ధరలు ఎంతగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, ముంబై నుంచి వెళ్లే విమానాలతో పోలిస్తే ఢిల్లీ నుంచి వెళ్లే వాటికి మాత్రం చార్జీలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఢిల్లీ నుంచి నెవార్క్ వెళ్లే విమానాలకు అతి తక్కువ చార్జీ రూ.95 వేలుగా ఉంది.

ఇటీవలే ఎయిరిండియా ప్రారంభించిన బెంగళూరు–శాన్ ఫ్రాన్సిస్కో విమానాల్లో ప్రయాణాలకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఈ నెలలో దాదాపు సీట్లన్నీ బుక్ అయిపోయాయి. ఈ రూట్ లో అతి తక్కువ చార్జీ రూ.98 వేలు. జనవరి 14న ప్రయాణానికి బుక్ అయిన టికెట్లకు ఈ ధర పలికింది.

అవన్నీ కూడా ఎక్కడా ఆగకుండా డైరెక్ట్ గా వెళ్లే విమానాలు. అయితే, ఆగకుండా నేరుగా వెళ్లే విమానాలతో పోలిస్తే.. లండన్, దుబాయ్, యూరప్ దేశాల్లో ఓసారి ఆగి అక్కడి నుంచి అమెరికాకు వెళ్లే విమానాల్లో టికెట్ ధరలు తక్కువగానే ఉన్నాయి. కానీ, విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులు కేవలం నేరుగా వెళ్లే విమానాల్లోనే ప్రయాణించాలని, హాల్ట్ అయ్యే విమానాల్లో వెళ్లరాదనీ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. కేవలం ఎయిరిండియా లేదా యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో మాత్రమే అమెరికాకు వెళ్లేందుకు వీలుందని విమానయాన సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో పెట్టిన నిబంధనలతో తక్కువ విమాన సర్వీసులు నడవడం, అమెరికాలో కొత్తగా స్ప్రింగ్ సెమిస్టర్ కోర్సులు మొదలవడం వంటి కారణాలతో రేట్లు విపరీతంగా పెరిగాయని ఓ అధికారి చెప్పారు. దీని వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతోంది విద్యార్థులేనని ఆ అధికారి చెప్పుకొచ్చారు. టికెట్ ధర తగ్గాలంటే రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఎక్కువగా చెల్లించి తిరుగు ప్రయాణ టికెట్ నూ బుక్ చేసుకోవాల్సిందేనన్నారు. గతేడాది డిసెంబర్ లో టికెట్లు బుక్ చేసుకున్నవారు.. తిరుగు ప్రయాణానికీ బుక్ చేసుకున్నట్టయితే లబ్ధి కలుగుతుందన్నారు.

ఇక, ప్రయాణ తేదీని మార్చుకునే సౌలభ్యం కల్పించిన ఎయిరిండియా అందుకు రూ.7 వేలు చార్జ్ చేసిందని, యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఉచితంగా ఆ సేవలను అందిస్తున్నా.. రెండింటి చార్జీల్లో తేడా లేదని చెప్పారు. విద్యార్థుల విషయంలో తిరుగు ప్రయాణం కష్టం కాబట్టి.. వన్ వే చార్జీలతోనే వెళ్లాల్సి ఉంటుందని సదరు అధికారి వివరించారు.

More Telugu News