India: నాలుగో టెస్టు ఆడేదెవరు?... కనీసం 11 మంది కూడా లేని స్థితిలో టీమిండియా!

  • తుది అంకానికి చేరిన ఆసీస్ పర్యటన
  • ఇప్పటికే గాయాలతో పలువురు దూరం
  • అనుభవం లేని ఆటగాళ్లను దించాల్సిన పరిస్థితి
Who is Last 11 Playing with Australia

ఆస్ట్రేలియాలో జరుగుతున్న భారత క్రికెట్ జట్టు పర్యటన తుది అంకానికి చేరింది. ఇప్పటికే వన్డే సిరీస్ ను ఆసీస్ జట్టు, టీ-20 సిరీస్ ను ఇండియా గెలుచుకున్నాయి. అత్యంత కీలకమైన టెస్ట్ సిరీస్ లో మూడు మ్యాచ్ లు ముగియగా, చెరో మ్యాచ్ ని రెండు జట్లూ గెలుచుకుని, ఒక మ్యాచ్ ని డ్రాగా ముగించాయి. దీంతో 1-1 తో ప్రస్తుతానికి సిరీస్ సమంగా ఉంది.

ఇక నాలుగో మ్యాచ్ బ్రిస్బేన్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో తుది జట్టులో ఉండే 11 మంది ఆటగాళ్లు ఎవరన్న విషయమై భారత్ జట్టు మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లంతా గాయాల బారినపడి మ్యాచ్ కి దూరమైన నేపథ్యంలో ఫిట్ గా ఉండే వారి కోసం వెతకాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం టీమిండియా గాయాల బారిన పడిన వారికి చికిత్సను అందిస్తున్న ఆసుపత్రి వార్డులా ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రధాన బౌలర్ బుమ్రా, మయాంక్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తదితరులు ఇప్పటికే తుది మ్యాచ్ లోకి దిగలేని పరిస్థితి నెలకొంది. వీరితో పాటు హనుమ విహారి కూడా గాయపడ్డాడు. వీరి స్థానంలో పృథ్వీషా, కుల్ దీప్ యాదవ్ లను తుది జట్టులోకి తీసుకోవడంతో పాటు వాషింగ్టన్ సుందర్ ను అరంగేట్రం చేయించే అవకాశాలున్నాయి.

ప్రధాన ఆటగాళ్లు లేకుండా ఇంతవరకూ ఆసీస్ ఓడిపోని మైదానంలో భారత్ ఏ మాత్రం ఆడి విజయం సాధిస్తుందన్న సంగతి అనుమానమే. ఈ విషయంలో జట్టు మేనేజ్ మెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నదన్న విషయంలోనూ ఆసక్తి నెలకొంది. కేవలం రెండు టెస్ట్ మ్యాచ్ ల అనుభవం మాత్రమే ఉన్న సిరాజ్ పేస్ బౌలింగ్ కు సారథ్యం వహించాల్సిన పరిస్థితి. అతనికి ఒకే మ్యాచ్ అనుభవమున్న సైనీ తోడు. ఇక, మూడో పేస్ బౌలర్ కావాలంటే, ఒక్క మ్యాచ్ కూడా ఆడని నటరాజన్ మాత్రమే ఆప్షన్.

వాస్తవానికి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత టీమ్ చాలా గట్టిది. అయితే, దుబాయ్ లో ఐపీఎల్ మ్యాచ్ ల నుంచి ఎంతో మంది గాయపడ్డారు. ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ, కేఎల్ రాహుల్, హనుమ విహారి, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్, జస్ ప్రీత్ బుమ్రాలు ఏదో ఓ దశలో గాయాలతో బాధపడిన వారే. వీరిలో రోహిత్ శర్మ చివరి దశలో అందుబాటులోకి రాగా, పలువురు అదే దశలో దూరం కావడం భారత క్రీడాభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

More Telugu News