Bandi Sanjay: ఆలయాలపై దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది: బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

  • విగ్రహాలు ధ్వంసమవుతున్నా జగన్ ఎందుకు స్పందించడం లేదు
  • ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోంది
  • బైబిల్ పార్టీ కావాలో లేక భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలి
  • సోము వీర్రాజు దమ్మున్న నాయకుడు  
  • తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది 
Bandi Sanjay criticises Jagan

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. హైదరాబాదులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. హిందూ దేవాలయాలకు వస్తున్న కానుకలు, నిధులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇతర మతాలకు దారి మళ్లిస్తోందని దుయ్యబట్టారు. ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని అన్నారు.

 దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని హెచ్చరించారు.

సోము వీర్రాజు నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ పోరాటానికి సిద్ధమవుతోందని చెప్పారు. ఇప్పటికే హిందూ సంఘాలతో కలసి ఉద్యమాలు చేస్తోందని తెలిపారు. హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని చెప్పారు.

సింహాచలం పాలక మండలి మార్పు నుంచి, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం, నిన్న రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును ఖండించడం వరకు ఎన్నో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం అత్యంత దారుణమని అన్నారు. తెలంగాణలో ఒక మతానికి ఇక్కడి సీఎం కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని... ఏపీలో ఒక మతమే రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు.  

తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ బీజేపీ కార్యకర్తలు బలవంతులని, దమ్మున్నవారని బండి సంజయ్ అన్నారు. సోము వీర్రాజు దమ్మున్న నాయకుడని, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఏపీ బీజేపీ కార్యకర్తల సహనాన్ని అక్కడి సీఎం పిరికితనంగా భావించవద్దని, ఒకవేళ భావిస్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు.  

తిరుమలకు వస్తున్న ఆదాయమంతా ఎక్కడకు పోతోందని నిలదీశారు. రెండు కొండలవాడా గోవిందా గోవిందా అనే వైసీపీకి ఓటు వేస్తారా? లేక ఏడు కొండలవాడా గోవిందా గోవిందా అనే బీజేపీకి ఓటువేస్తారా? అనే విషయాన్ని ఏపీలోని హిందువులందరూ ఆలోచించాలని అన్నారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.

ఏడు కొండలను రెండు కొండలు చేయాలనుకున్న పార్టీ ఇప్పుడు ఏపీలో రాజ్యాధికారాన్ని చెలాయిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారని... అధికార పార్టీకి బుద్ధి చెపుతారని అన్నారు. తిరుపతి ప్రజలు ఇచ్చే తీర్పు కుహనా లౌకికవాదుల చెంప ఛెళ్లుమనిపించేలా ఉండాలని పిలుపునిచ్చారు.

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురు చూస్తోందని చెప్పారు. తిరుపతిలో ధర్మం గెలవబోతోందా? లేక హిందూ మత వ్యతిరేకులు గెలుస్తారా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడినైన తాను... ఏపీలో జరుగుతున్న దారుణాలపై బాధతోనే మాట్లాడానని చెప్పారు. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News