Britain: ప్రపంచానికి పాకిపోతున్న బ్రిటన్ వైరస్.. ఇప్పటికే 30 దేశాల్లో అడుగు!

  • తాజాగా, వియత్నాంలో అడుగుపెట్టిన కొత్త స్ట్రెయిన్
  • యూకే నుంచి వచ్చిన ప్రయాణికురాలిలో గుర్తింపు
  • టర్కీలో 15 మందిలో కొత్త రకం వైరస్ లక్షణాలు
New Virus Strain Spreads to About 30 Countries

బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్‌లోని కొత్త రకం నెమ్మదిగా ప్రపంచ దేశాలను కమ్మేస్తోంది. ఇప్పటి వరకు 30 దేశాలలో ఇది అడుగుపెట్టింది. నిజానికి ఇది తొలినాటి వైరస్ కంటే మరింత వేగంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కొత్త స్ట్రెయిన్‌తో అప్రమత్తమైన పలు దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించడంతోపాటు విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. మరికొన్ని దేశాలు వైరస్ ఉనికిలో ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాయి.

నిన్న వియత్నాంలో బ్రిటన్ వైరస్‌కు సంబంధించి తొలి కేసు నమోదైంది. ఇటీవల యూకే నుంచి వచ్చిన మహిళలో ఈ వైరస్‌ను గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. కాగా, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇప్పటికే నిషేధం విధించిన వియత్నాం.. యూకేలోని తమ పౌరుల కోసం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. యూకే నుంచి తిరిగి వచ్చిన 15 మందిలో కొత్త వైరస్ లక్షణాలను గుర్తించినట్టు మొన్న టర్కీ ప్రకటించింది. అమెరికాలో ఇప్పటి వరకు మూడు కొత్త కేసులు నమోదయ్యాయి.

నిజానికి ఈ వైరస్ అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాపించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండడంతో గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌తో అల్లాడిపోతున్న అమెరికాలో కొత్త వైరస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వైరస్ వెలుగు చూసిన బ్రిటన్‌లో దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పార్క్‌లను మూసివేసింది. తాజాగా, ఐర్లండ్‌లోనూ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

More Telugu News