survey: ఇప్ప‌ట్లో ఐటీ ఆఫీసులకు వెళ్లి ప‌నిచేసే ఛాన్స్ లేదు.. సర్వేలో వెల్ల‌డి

  • క‌రోనా నేప‌థ్యంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే ప‌ని
  • మార్చి త‌ర్వాత ఆఫీసుల‌కు క్ర‌మంగా వెళ్లే అవ‌కాశం
  • ఈ ఏడాది చివ‌రి నాటికి బాగా పెరిగే ఛాన్స్
  • హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్ వెల్ల‌డి
no chances to go offices

కరోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఐటీ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు ఇంటి నుంచే ప‌ని చేసే అవ‌కాశం క‌ల్పిస్తోన్న విష‌యం తెలిసిందే. క‌రోనా వ్యాప్తి ఇప్ప‌టికీ త‌గ్గ‌క‌పోవ‌డం, త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండ‌డంతో తిరిగి ఉద్యోగులు కార్యాల‌యాల‌కు వెళ్తారా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

ఈ నేప‌థ్యంలో  హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) నిర్వ‌హించిన ఓ సర్వేలో ప‌లు విష‌యాలు వెల్లడయ్యాయి. ఐటీ ఉద్యోగులు ఇప్పట్లో పూర్తి స్థాయిలో కార్యాల‌యాల‌కు వెళ్లటం సాధ్యం కాకపోవచ్చని తేలింది. ఇంటి నుంచి ప‌ని ఈ ఏడాది మార్చి వరకు నిరాటంకంగా కొన‌సాగుతుంది.

ఆ తర్వాత క్ర‌మంగా కార్యాల‌యాల‌కు వెళ్లడం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది చివ‌ర్లో అది బాగా పెరుగుతుంది. అయితే, 100 శాతం మంది కార్యాల‌యాల‌కు వెళ్లి పనిచేయడం అనేది ఉండక‌పోవ‌చ్చు. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో కాకుండా వేరే ప్రాంతాల నుంచి వ‌ర్క్ ఫ్రం హోం చాలా మంది చేస్తున్నారు.

వారంతా మళ్లీ ఇప్పటికిప్పుడు తమ కుటుంబాలతో హైద‌రాబాద్ కి రావడమ‌న్న‌ది సాధ్యం అయ్యే పని కాదు. వ‌ర్క్ ఫ్రం హోంలో ఉత్పాదకత చాలా అధికంగా ఉంది. 63 శాతం కంపెనీలు తమ సిబ్బంది ఉత్పాదకత 90 శాతానికి పైగా ఉన్నట్లు సర్వేలో తెలిపాయి. అంతేకాదు, కొన్ని పెద్ద కంపెనీల ఉత్పాద‌క‌త 100 శాతం ఉంది.

అయితే, వ‌ర్క్ ఫ్రం హోం వ‌ల్ల ఉద్యోగుల‌కు తగినంత బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. సైబర్‌ భద్రతా సమస్యలు కూడా ఉంటాయి.  ఇంట్లో కొంద‌రికి ప‌నికి త‌గ్గ‌ అనుకూలమైన వాతావరణం ఉండ‌డం లేదు. ఒక్కోసారి ఇంట్లో కరెంటు కోతలు వంటి స‌మ‌స్య‌లు ఉంటాయి. ప్రస్తుతం 31 శాతం కంపెనీలకు చెందిన 20 శాతం మంది ఉద్యోగులు మాత్ర‌మే కార్యాల‌యాలకు వెళ్లి పని చేస్తున్నారు.

55 శాతం కంపెనీల సిబ్బందిలో 5 శాతం మాత్రం మాత్రమే కార్యాల‌యాల‌కు వెళ్తున్నారు. ఒక‌వేళ తమ క్లయింట్లు అడిగితే ఉద్యోగుల‌ను ఆఫీసుకు పిలిచి పని చేయించాల్సి వస్తుందని కొన్ని పెద్ద కంపెనీలు చెప్పాయి. వ్యాక్సిన్ వ‌చ్చిన త‌ర్వాత కార్యాల‌యాల‌కు వ‌చ్చి ప‌నిచేయ‌డంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోతేనే కార్యాల‌యాల‌కు మ‌ళ్లీ సిబ్బందిని పూర్తి స్థాయిలో పిలుస్తామ‌ని సంస్థలు అంటున్నాయి.

More Telugu News