Test match: రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్.. ఆసీస్‌పై 131 పరుగుల ఆధిక్యం!

India lead 131 runs in second test

  • తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌట్
  • మూడో రోజు 49 పరుగులకే చివరి ఐదు వికెట్లు డౌన్
  • అర్ధ సెంచరీతో మెరిసిన జడేజా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆసీస్‌పై 131 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 277/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ వడివడిగా వికెట్లు కోల్పోయింది. కేవలం 49 పరుగులు మాత్రమే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.

కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన అజింక్య రహానే సెంచరీతో అదరగొట్టాడు. 223 బంతుల్లో 12 ఫోర్లతో 112 పరుగులు చేసిన రహానే రనౌట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా 57 పరుగులు చేశాడు. అశ్విన్ 14, ఉమేశ్ యాదవ్ 9 పరుగులు చేయగా, జస్ప్రీత్ బుమ్రా డకౌట్ అయ్యాడు. సిరాజ్ (0) నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, కమిన్స్ రెండు, హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

Test match
Team India
Australia
Ajinkya Rahane
Ravindra Jadeja
  • Loading...

More Telugu News