Beli Devi: ఒకే వేదికపై వివాహాలు చేసుకున్న తల్లి, కుమార్తె

  • ఉత్తరప్రదేశ్ లో సామూహిక వివాహాలు
  • ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన కింద పెళ్లిళ్లు
  • చిన్న మరిదిని పెళ్లాడిన మహిళ
  • ఓ యువకుడ్ని పెళ్లాడిన కుమార్తె
  • తల్లి మళ్లీ పెళ్లి చేసుకోవడం పట్ల పిల్లల సంతోషం
Mother and daughter married on the same venue in the part of Samuhik Vivah Yojna

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. సామూహిక వివాహాల్లో భాగంగా ఓ యువతితో పాటు ఆమె తల్లి కూడా పెళ్లి చేసుకుంది. గోరఖ్ పూర్ లోని పిప్రోలీ ప్రాంతంలో ఇటీవల సామూహిక వివాహాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన కింద ఈ పెళ్లిళ్ల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బేలి దేవి అనే 53 ఏళ్ల మహిళ తన సొంత మరిదిని పెళ్లాడగా, ఆమె కుమార్తె ఇందు (27) ఓ యువకుడ్ని పెళ్లి చేసుకుంది.

బేలిదేవి భర్త హరిహర్ పాతికేళ్ల కిందట చనిపోయాడు. ఈ క్రమంలో ఆమె తన చిన్నమరిది జగదీశ్ (55)తో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. జగదీశ్ ఇప్పటివరకు అవివాహితుడిగానే ఉన్నాడు. తమ పెళ్లిపై బేలి దేవి మాట్లాడుతూ, తన ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జీవితంలో స్థిరపడ్డారని, తన మరిదిని చేసుకోవాలని నిర్ణయించుకోగా, తన పిల్లలందరూ సంతోషం వ్యక్తం చేశారని వెల్లడించింది.

ఆమె చిన్న కుమార్తె ఇందు ఈ కార్యక్రమంలో రాహుల్ (29) అనే వ్యక్తిని వివాహమాడింది. తల్లి మళ్లీ పెళ్లిచేసుకోవడం పట్ల ఇందు స్పందిస్తూ, అమ్మ, అంకుల్ జోడీ బాగుందని, వారిద్దరూ ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారని మురిసిపోయింది.

More Telugu News