Farmers: చేస్తారా? లేదా? ఏదో ఒకటి చెప్పండి.. అంతే: అమిత్ షాకు తేల్చి చెప్పిన రైతు సంఘాల నేతలు

Farmers Says Say Yes or No to Amit Shah

  • నిన్న రాత్రి పొద్దుపోయేవరకూ సమావేశం
  • చట్టాలను రద్దు చేయాల్సిందేనన్న రైతు సంఘాలు
  • నేడు రాష్ట్రపతితో కీలక చర్చలు జరపనున్న రైతు నేతలు

మంగళవారం రాత్రి నుంచి పొద్దుపోయే వరకూ సాగిన రైతు సంఘాల నేతలతో సమావేశం కూడా విఫలమైంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం తేలలేదు. తమకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని, అదొక్కటే తమ డిమాండని, అందుకు సానుకూలంగా ఉన్నారా?లేదా? అన్న విషయాన్ని మాత్రం తమకు చెబితే చాలని రైతు నేతలు అమిత్ షా ముందు స్పష్టం చేశారు.

తన నివాసానికి కాస్తంత దూరంలోనే ఉన్న పుసా అగ్రికల్చర్ ఇనిస్టిట్యూషన్ క్యాంపస్ లో రైతు సంఘాల నేతలతో అమిత్ షా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించ లేదు. మంగళవారం జరిగిన భారత్ బంద్ విజయవంతమైన నేపథ్యంలో అత్యున్నత స్థాయిలో రైతులతో చర్చించాలని సమావేశం కావాలని కేంద్రం నిర్ణయించి, ఈ భేటీని జరిపినా, ఫలితం మాత్రం రాకపోవడం గమనార్హం.

"ఈ సాయంత్రం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అమిత్ షా సమావేశానికి రావాలని, వెళ్లినా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఏమీ చెప్పలేదు" అని రైతుల నేత రాకేశ్ తికైత్ అసహనాన్ని వ్యక్తం చేశారు. తనతో పాటు చాలా మంది ఈ సమావేశానికి వచ్చారని, తాము మాత్రం చట్టాలను వెనక్కు తీసుకుంటారా? లేదా?అన్న ఒక్క ప్రశ్నను మాత్రమే అడిగామని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా లేదని ఆయన ఆరోపించారు. 

ఇదిలావుండగా, నిన్నటి భారత్ బంద్ కు విపక్ష పార్టీలయిన కాంగ్రెస్, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ, డీఎంకే, టీఆర్ఎస్ తదితర పార్టీలు సహకరించిన సంగతి తెలిసిందే. పలు చోట్ల బంద్ విజయవంతం అయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన కేంద్రం, ఈ దఫా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో రైతులు సమావేశం కావాలని ఆహ్వానించింది. నేడు ఈ సమావేశం జరుగనుంది.

Farmers
Protest
Amit Shah
Meeting
  • Loading...

More Telugu News