Sunny Deol: రైతుల ఆందోళనలపై బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ స్పందన

  • రైతుల మేలు కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు
  • ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది
  • దీప్ సిద్ధూ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం
Actor and BJP MP Sunny Deol finally breaks his silence on farmers protest

కొత్త వ్యవసాయ చట్టాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ శివార్లలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారితో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, గుర్దాస్ పూర్ బీజేపీ ఎంపీ సన్నీడియోల్ స్పందిస్తూ... తాను తన పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఇదే సమయంలో రైతులకు కూడా అండగా ఉంటానని చెప్పారు.

రైతుల జీవితాలను మెరుగు పరిచేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని సన్నీ డియోల్ తెలిపారు. ఇది కేవలం రైతులు-కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్న సమస్య అని... ఇతరులెవరూ ఇందులో జోక్యం చేసుకోవద్దని కోరారు. ఈ సమస్యకు త్వరలోనే ఓ పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ సమస్య నుంచి లబ్ధి పొందాలని చాలా మంది భావిస్తున్నారని విమర్శించారు. వీరెవరూ రైతుల సంక్షేమం గురించి ఆలోచించడం లేదని... వారి సొంత అజెండా వారికి ఉందని చెప్పారు. తప్పు దోవ పట్టిస్తున్న వారని రైతులు నమ్మరాదని సూచించారు.

ఎన్నికల సమయంలో తనతో పాటు ఉన్న సినీ నటుడు దీప్ సిద్ధూ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాటితో తనకు సంబంధం లేదని సన్నీ డియోల్ తెలిపారు. చాలా కాలంగా దీప్ తనతో కాంటాక్ట్ లో లేడని చెప్పారు. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు సఫలమవుతాయనే నమ్మకం తనకు ఉందని అన్నారు.

రైతుల పోరాటానికి ఖలిస్థాన్ మద్దతుదారుల సపోర్ట్ ఉందంటూ దీప్ సిద్ధూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.

More Telugu News