GHMC Elections: కొడుకు వల్ల ఊహించని విధంగా ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థిని!

  • 32 ఓట్లతో ఓడిపోయిన లక్ష్మీప్రసన్నగౌడ్
  • డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమె కుమారుడు రంజిత్
  • రంజిత్ కు పోలైన 39 ఓట్లు
TRS candidate lost election due to her son

జీహెచ్ఎంసీ ఫలితాలు పలు చోట్ల అంచనాలకు భిన్నంగా, ఆసక్తికరంగా వెలువడ్డాయి. హయత్ నగర్ సర్కిల్ లోని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో తల్లి ఓటమికి కుమారుడే కారకుడైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే లక్ష్మీప్రసన్నగౌడ్ టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. బీజేపీ తరపున మొద్దు లచ్చిరెడ్డి బరిలోకి దిగారు.

తొలుత 1206 ఓట్ల ఆధిక్యతతో కొనసాగిన లక్ష్మీప్రసన్న చివరకు ఓటమి పాలయ్యారు. 32 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమికి ఆమె కుమారుడే కారణమయ్యాడు. ఆమె కుమారుడు రంజిత్ గౌడ్ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఆయనకు 39 ఓట్లు వచ్చాయి. నామినేషన్ ను ఆయన ఉపసంహరించుకుని ఉంటే... ఆ ఓట్లు టీఆర్ఎస్ కు పడేవి. దీంతో, లక్ష్మీప్రసన్న గెలిచేది. విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో.

More Telugu News