Asaduddin Owaisi: రోహింగ్యాల లెక్కలు నన్ను అడిగితే ఎట్లా... మీరే తెలుసుకుని చెప్పండి: అసదుద్దీన్ ఒవైసీ

  • ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం
  • ఖిల్వత్ మైదానంలో ఎంఐఎం బహిరంగ సభ
  • గల్లీ ఎన్నికలకు కూడా ఢిల్లీ నేతలు వచ్చారన్న ఒవైసీ
Asaduddin Owaisi slams BJP leaders

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నేటితో ప్రచారం ముగిసింది. ఎంఐఎం పార్టీ తన చివరి బహిరంగ సభను హైదరాబాద్ పాతబస్తీలోని ఖిల్వత్ మైదానంలో నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతరాజకీయాలు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం హైదరాబాదుకు ఇచ్చిందేమీ లేదని అన్నారు.

ఎంఐఎంను ఎదుర్కొనడానికి బీజేపీ అగ్రనేతలు బారులు తీరారని, యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీ, ఇవాళ అమిత్ షా వచ్చారని ఎద్దేవా చేశారు. రోహింగ్యాల లెక్కలు నన్ను అడిగితే ఎట్లా... మీరే తెలుసుకుని చెప్పండంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

"గల్లీ ఎన్నికలకు కూడా ఢిల్లీ నేతలు రావడం హాస్యాస్పదంగా ఉంది. ఓ చిన్న పిల్లవాడు నాతో ఇలా అన్నాడు... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్ప అందరూ వచ్చారు అని వ్యాఖ్యానించాడు. ఆ పిల్లవాడి వ్యాఖ్యలు నిజమే అనిపించింది... దొరికితే ట్రంప్ ను కూడా తీసుకువచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయించేవాళ్లు" అంటూ బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు.

More Telugu News