Suicide Attack: ఆత్మాహుతి దాడితో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్థాన్... 30 మంది భద్రతా సిబ్బంది మృతి!

  • మరోసారి నెత్తురోడిన ఆఫ్ఘనిస్థాన్
  • ఘాజ్నీ నగర శివార్లలో కారుతో ఆత్మాహుతి దాడి
  • కారు నిండా పేలుడు పదార్థాలు
Afghanistan witnessed another suicide attack

గత కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదంతో అట్టుడికిపోతున్న ఆఫ్ఘనిస్థాన్ లో మరోసారి రక్తం చిందింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది మరణించారు. ఘాజ్నీ నగర శివార్లలో ఓ కారులో పేలుడు పదార్థాలు నింపి ఈ దాడికి పాల్పడ్డట్టు గుర్తించారు. ఘాజ్నీ ప్రావిన్స్ లో తాలిబాన్ దళాలకు, ప్రభుత్వ బలగాలకు నిత్యం పోరాటం జరుగుతూనే ఉంటుంది. కాగా, తాజాగా జరిగిన దాడిలో 30 మృతదేహాలను, 24 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువచ్చారని, వారందరూ భద్రతా సిబ్బందేనని ఘాజ్నీ ఆసుపత్రి డైరెక్టర్ బాజ్ మహ్మద్ హెమత్ వెల్లడించారు.

దాడిపై ఆఫ్ఘన్ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ, ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. కొన్నిరోజుల కిందటే ఆఫ్ఘనిస్థాన్ లోని బమియాన్ నగరంలో రెండు శక్తిమంతమైన పేలుళ్లు జరిగి 14 మంది మృత్యువాత పడ్డారు.

More Telugu News