Andhra Pradesh: ప్రియుడి కోసం భర్త హత్య.. రూ. 10 లక్షలకు భార్య సుపారి!

  • గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలో ఘటన
  • సైనేడ్‌ను తొలుత కుక్కకు తినిపించి పరీక్ష
  • మచిలీపట్టణం యువకులతో హత్యకు ఒప్పందం
Wife murdered wife with help of lover

ప్రియుడి కోసం భర్తను వదిలించుకోవాలనుకున్న భార్య ఏకంగా 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి భర్తను చంపించింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని పెదకూరపాడు మండలం 75 తాళ్లూరుకు చెందిన భాష్యం బ్రహ్మయ్య గ్రామంలో హోటల్‌తోపాటు పాల వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. ఈ నెల 4న గ్రామ శివారులో బ్రహ్మయ్యను అడ్డగించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖంపై విషపూరిత రసాయనాలు చల్లి దాడికి యత్నించారు. 


వారి నుంచి తప్పించుకున్న బ్రహ్మయ్య సమీపంలో ఉండే బంధువుల ఇంటికి చేరుకుని జరిగిన విషయం చెప్పాడు. వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య జరిగిన రోజు రాత్రి బ్రహ్మయ్య భార్య సాయికుమారి అదే గ్రామానికి చెందిన అశోక్‌రెడ్డికి కాల్ చేసినట్టు గుర్తించారు. అదే సమయంలో కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి కూడా కాల్స్  వెళ్లినట్టు గుర్తించారు. కాల్‌డేటా ఆధారంగా సాయికుమారిని విచారించగా అశోక్‌రెడ్డితో ఉన్న వివాహేతర సంబంధం బయటపడింది.

దీంతో మరింత లోతుగా విచారించగా బ్రహ్మయ్య హత్యకు పన్నిన కుట్ర బయటపడింది. తమ మధ్య కొనసాగుతున్న సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని హత్య చేయాలని ప్రియుడు అశోక్‌రెడ్డితో కలిసి సాయికుమారి కుట్ర పన్నింది. ఇందులో భాగంగా మచిలీపట్టణానికి చెందిన పవన్ కుమార్, షేక్ షరీఫ్‌లతో రూ. 10 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించారు. 

ఈ క్రమంలో హత్య కోసం సైనేడ్‌ను ఉపయోగించారు. అది పనిచేస్తుందో, లేదో తెలుసుకునేందుకు ఓ కుక్కకు తినిపించగా, అది వెంటనే మరణించింది. దీంతో బ్రహ్మయ్య హత్యకు సిద్దమయ్యారు. అతడిని చంపేందుకు తొలుత రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత గ్రామ శివారులో ఒంటరిగా కనిపించిన బ్రహ్మయ్యపై సైనేడ్ చల్లి పరారయ్యారు. దాని ప్రభావంతోనే అతడు మరణించినట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుపారీ తీసుకున్న ఇద్దరు యువకులతోపాటు సాయికుమారి, అతడి ప్రియుడు అశోక్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు.

More Telugu News