Vikram Goud: నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న విక్రమ్ గౌడ్

  • విక్రమ్ గౌడ్ తో చర్చలు జరిపిన డీకే అరుణ
  • బుజ్జగించేందుకు యత్నించిన కాంగ్రెస్ నేతలు
  • కాంగ్రెస్ లో ఉండలేనని స్పష్టం చేసిన గౌడ్
Congress leader Vikram Goud to join BJP

జీహెచ్ఎంసీ ఎన్నికలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరుతుండటంతో బీజేపీ శిబిరం కళకళలాడుతోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను చేర్చుకునేందుకు బీజేపీ కీలక నేతలందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నుంచి మరో నేత బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. విక్రమ్ గౌడ్ (మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు) బీజేపీలో చేరబోతున్నారు. విక్రమ్ గౌడ్ ను బీజేపీలో చేరాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆహ్వానించారు. దీంతో బీజేపీలో చేరేందుకు ఆయన సమ్మతించారు. రేపు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతున్నారు.

మరోవైపు ఈ విషయం తెలియగానే విక్రమ్ గౌడ్ ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగారు. సీనియర్ నేత వి.హనుమంతరావు స్వయంగా వెళ్లి ఆయనతో మాట్లాడారు. రాజనర్సింహ, సీతక్కలు ఫోన్ చేసి బుజ్జగించారు. అయితే, గౌరవం లేని చోట తాను ఉండలేనని వారికి విక్రమ్ స్పష్టం చేశారు.

More Telugu News