Uttam Kumar Reddy: టీఆర్ఎస్ హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఇచ్చిన హామీలు మర్చిపోయే పార్టీ అంటూ ధ్వజం
  • ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇస్తారని వ్యాఖ్యలు
  • ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శలు
TPCC President Uttam Kumar Reddy take a dig at TRS party

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం టీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని, ఆ పార్టీని, వారి మేనిఫెస్టోను ప్రజలు చెత్తబుట్టలో విసిరేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గతంలో హుస్సేన్ సాగర్ లో నీళ్లను కొబ్బరినీళ్లలా మార్చుతామన్నారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశాన్నంటే భవంతులు కడతామన్నారు, సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. హైదరాబాదులో ఉచిత వై-ఫై ఇస్తామన్నారు... వీటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు.

"నగరంలో ఒక లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఒక్కటీ ఇవ్వలేదు. నిమ్స్ ఆసుపత్రిని దిగజార్చి బస్తీ దవాఖానాల గురించి గొప్పగా చెబుతున్నారు. కనీసం ఉచితంగా తాగునీరు ఇవ్వలేకపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్లే హైదరాబాద్ వరదల్లో మునిగితే వరద బాధిత కుటుంబాల్లో ఒక్కరినైనా సీఎం కేసీఆర్ పరామర్శించారా?" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News