Amit Shah: జోరు పెంచిన బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న అమిత్‌ షా, నడ్డా, యోగి!

  • ఈ రోజు పర్యటన షెడ్యూల్ విడుదల
  • మరికొంతమంది అగ్ర నేతలు కూడా హైదరాబాద్‌కి
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
shah to come hyderabad

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జోరుగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలను రంగంలోకి దింపిన బీజేపీ..  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఇక్కడకు తీసుకురావాలని ప్రణాళిక వేసుకుంది.

అంతేకాదు, మరికొంతమంది నేతలు అగ్ర నేతలు కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వారి హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ కాసేపట్లో విడుదల కానుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన భూపేంద్ర యాదవ్‌ ఇప్పటికే రాష్ట్ర నేతలకు సూచనలు చేస్తోన్న విషయం తెలిసిందే.  

మరోపక్క, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్‌రావు వంటి వారు హైదరాబాద్‌లో ప్రచారంలో పాల్గొంటోన్న విషయం తెలిసిందే. ఓటర్లను మరింత ఆకర్షించడానికి జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపుతున్నారు.

మరో మూడేళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఎ‍న్నికలు ఉన్నాయి. ఇప్పటికే దుబ్బాకలో బీజేపీ గెలిచి తెలంగాణలో పార్టీ పట్టు సాధిస్తుందన్న సంకేతాలు ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు వేసుకుంటోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే మరింత జోష్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో అగ్ర నేతలను బీజేపీ రంగంలోకి దింపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి వలసలు అధికమవుతుండడం బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా బీజేపీలో చేరనున్న విషయం తెలిసిందే. ఆమె కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. 150 డివిజన్‌లు ఉన్న ‌ జీహెచ్‌ఎంసీలో డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరుగనుండగా, 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల ప్రచార సమయం గడువు ముగియడానికి ముందు రోజు అమిత్ షా ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగితే ఓటర్లను మరింత ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది.

More Telugu News