court: తప్పుడు రేప్ కేసు పెట్టిన అమ్మాయి.. యువకుడికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం!

court  gives a rare judgement on a rape case

  • కొన్నేళ్లు విచారణ ఎదుర్కొన్న అబ్బాయి
  • అమ్మాయికి పుట్టిన శిశువుకి తండ్రి ఆ యువకుడు కాదని తేలిన వైనం
  • పరిహారం చెల్లించాలని యువకుడు కేసు
  • అతడికి అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు

ఒక అబ్బాయిపై కక్షతో రేప్ కేసు పెట్టి, అతనిని మానసిక క్షోభకు గురిచేసిన కేసు నుంచి సదరు యువకుడికి చెన్నైలోని న్యాయస్థానం విముక్తి ప్రసాదించింది. అంతేకాకుండా, పరువు నష్టంగా సదరు యువకుడికి కేసు పెట్టిన అమ్మాయి కుటుంబం నుంచి 15 లక్షల పరిహారం కూడా ఇప్పించింది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... తమిళనాడుకు చెందిన సంతోష్ అనే యువకుడి కుటుంబం, ఆ అమ్మాయి కుటుంబాల ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో సంతోష్‌తో ఆ యువతి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబాల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి. సంతోష్ కుటుంబం వేరే చోటుకి వెళ్లిపోయి అక్కడే నివసిస్తోంది. ఆ యువతి గర్బం దాల్చడంతో ఆమె కడుపులో పుట్టబోయే బిడ్డకు సంతోష్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పారు.

అయితే, తనకేమీ తెలియదని, ఆమెతో తాను ఎన్నడూ సన్నిహితంగా లేనని సంతోష్ తెలిపాడు. అయినప్పటికీ యువతి తల్లిదండ్రులు అతడిపై అత్యాచారం కేసు పెట్టారు. దీంతో  2009 నవంబరులో అరెస్టయిన సంతోష్ 95 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో వున్నాడు. 2010 ఫిబ్రవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఈ లోగా అతడిపై కేసు పెట్టిన యువతి ఓ పాపకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పాపకు డీఎన్‌ఏ పరీక్షలు చేయగా, ఆమె తండ్రి సంతోష్ కాదని తేలింది. 2016, ఫిబ్రవరి 10న న్యాయస్థానం అతడిని నిర్దోషిగా తేల్చి తీర్పు చెప్పింది. అనంతరం తనపై  అన్యాయంగా కేసు పెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఆ యువకుడు పరువు నష్టం దావా వేశాడు.

రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కూడా సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఆ మహిళ కుటుంబాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News