Jitender Reddy: ఓడిపోతారని తెలిసి కూడా.. హరీశ్‌రావును బలిపశువును చేశారు: జితేందర్ రెడ్డి

BJP will win in GHMC elections also

  • దుబ్బాకలో ఓడిపోతామనే విషయం కేసీఆర్ కు తెలుసు
  • కేసీఆర్ పోకడలను తిప్పికొట్టాలనే కసి ప్రజల్లో ప్రారంభమైంది
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80 సీట్లను గెలుస్తాం

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిపాలు కావడం బీజేపీలో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో ఓడిపోతామని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందే తెలుసని... అయినప్పటికీ మంత్రి హరీశ్ రావును బలిపశువును చేశారని చెప్పారు. కేసీఆర్ నిరంకుశ పాలనను, ఒంటెద్దు పోకడలను తిప్పికొట్టాలనే కసి ప్రజల్లో మొదలైందని అన్నారు. ఆ కసిని దుబ్బాక ఎన్నికల్లో జనాలు తీర్చుకున్నారని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ సత్తా చాటుతుందని జితేందర్ రెడ్డి తెలిపారు. వరదల సమయంలో ముంపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని విమర్శించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా 84 వేల మంది ప్రజలు నిలబడ్డారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు. అయితే, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి బీజేపీలో ఎప్పుడు చేరబోతున్నారనే సమాచారం తన వద్ద లేదని చెప్పారు.

Jitender Reddy
BJP
KCR
TRS
Harish Rao
Dubbaka
GHMC
  • Loading...

More Telugu News