Aishvarya Rajesh: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ సరసన మరో నాయిక!

  • కొన్నాళ్లుగా హైదరాబాదులో 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ 
  • ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • ఎన్టీఆర్ సరసన ఇద్దరు కథానాయికలు
  • గిరిజన యువతి పాత్రకు ఐశ్వర్య రాజేశ్ ఎంపిక  
Aishvarya Rajesh opposite NTR in RRR

ప్రస్తుతం నిర్మాణంలో వున్న టాలీవుడ్ సినిమాలలో 'ఆర్ఆర్ఆర్' ఒకటి. 'బాహుబలి' చిత్రాల తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం ఒక విశేషమైతే.. అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలసి నటిస్తున్న మల్టీ స్టారర్ కావడం ఇంకో విశేషం. దానికి తోడు బాలీవుడ్ బిజీ స్టార్ అలియా భట్ ఇందులో కథానాయికగా నటిస్తుండడం కూడా మరో విశేషమే!

లాక్ డౌన్ గ్యాప్ తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మళ్లీ హైదరాబాదులో నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఇదే నెలలో అలియా భట్ కూడా షూటింగులో జాయిన్ అవుతుందని అంటున్నారు. ఆమె ఏకబిగిన నెల రోజుల డేట్స్ ఇచ్చిందట.

ఇదిలావుంచితే, ఈ చిత్రంలో మరో కీలక పాత్ర వుంది. ఎన్టీఆర్ పాత్ర అయిన భీమ్ సరసన హాలీవుడ్ నటి ఓలీవియా మోరిస్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, భీమ్ కు జోడీగా మరో కథానాయిక కూడా ఉంటుందనీ, అది గిరిజన యువతి పాత్ర అనీ కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి.

ఇప్పుడీ పాత్రకు కథానాయిక ఐశ్వర్య రాజేశ్ (కౌసల్య కృష్ణమూర్తి ఫేమ్)ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. పాత్ర చిన్నదైనా విషయం గల పాత్ర కావడంతో ఐశ్వర్య రాజేశ్ ను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

More Telugu News