Delhi capitals: ఢిల్లీని ఉతికి పారేసిన హైదరాబాద్.. శ్రేయాస్ సేన ఘోర పరాజయం

Sun Risers Hyderabad beat Delhi Capitals

  • కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఢిల్లీ కేపిటల్స్
  • ప్లే ఆఫ్స్ ముంగిట ఢిల్లీకి వరుసగా మూడో పరాజయం
  • సాహాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

ఢిల్లీ కేపిటల్స్‌తో నిన్న జరిగిన ఐపీఎల్ 47వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ వార్నర్, వృద్ధిమాన్ సాహా బాదుడుతో ఏకంగా 219 పరుగుల భారీ స్కోరు చేసింది. 220 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఢిల్లీని హైదరాబాద్ బౌలర్లు దారుణంగా దెబ్బతీశారు.

ముఖ్యంగా రషీద్ ఖాన్, సందీప్ శర్మ, నటరాజన్‌లు ఏ దశలోనూ ఆ జట్టుకు అవకాశం ఇవ్వకుండా వికెట్లు పడగొట్టారు. ఫలితంగా మరో ఓవర్ మిగిలి ఉండగానే 131 పరుగులకే ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో మరో ఘోర పరాజయాన్ని ఢిల్లీ తన ఖాతాలో వేసుకుంది. ప్లే ఆఫ్స్ ముంగిట ఢిల్లీకి ఇది వరుసగా మూడో ఓటమి కాగా, ఈ విజయంతో హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది.

ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లో అజింక్య రహానే (26), రిషభ్ పంత్ (36), తుషార్ దేశ్‌పాండే (20), హెట్‌మయర్ (16) తప్ప మరెవరూ రాణించలేదు. ఈ సీజన్‌లో ఇరగదీస్తున్న శిఖర్ ధవన్ గోల్డెన్ డక్  కాగా, ఆరుగురు ఆటగాళ్లు కలిపి మొత్తం చేసిన పరుగులు 24 మాత్రమే. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. నదీమ్,  హోల్డర్, విజయ్ శంకర్ చెరో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దుబాయ్ స్టేడియంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు వార్నర్, సాహాలు ఢిల్లీ బౌలింగును ఊచకోత కోశారు. వేసిన బంతులను వేసినట్టు బౌండరీలకు తరలించారు. ఫలితంగా స్కోరు జెట్ స్పీడ్‌తో పరుగులు తీసింది. వార్నర్ 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేయగా, సాహా 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. మనీశ్ పాండే 44, విలియమ్సన్ 11 పరుగులు చేశారు. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సాహాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Delhi capitals
sun risers hyderabad
IPL 2020
Wriddhiman Saha
  • Loading...

More Telugu News