Shashi Tharoor: ఈ విషయంలో మోదీ పూర్తిగా ఫెయిల్ అయ్యారు: శశిథరూర్
![Modi failed in controlling of Corona virus says Shashi Tharoor](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-f42c78e55947.jpg)
- కరోనాను కట్టడి చేయడంలో మోదీ విఫలమయ్యారు
- కాంగ్రెస్ హెచ్చరికలను పట్టించుకోలేదు
- ముస్లిం వర్గంపై బీజేపీ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది
కరోనాను కట్టడి చేసే విషయంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ విమర్శించారు. మహమ్మారి విషయంలో ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ పలుమార్లు హెచ్చరించిందని, కరోనా కట్టడికి సంబంధించి సూచనలు చేసిందని... అయితే అన్నింటినీ ఆయన పెడచెవిన పెట్టారని అన్నారు. కరోనా విషయంలో కేంద్రం సరిగా వ్యవహరించలేదనే విషయాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. కరోనాను సీరియస్ గా తీసుకోకపోతే... దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని రాహుల్ గాంధీ పదేపదే చెప్పారని... అయినా కేంద్రం వినలేదని విమర్శించారు.
కరోనాను ఉపయోగించుకుని ముస్లిం వర్గంపై బీజేపీ మూర్ఖంగా ప్రవర్తిస్తోందని... తబ్లిగీ జమాతే కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వివక్షను చూపుతోందని థరూర్ ఆరోపించారు. ఇలాంటి వివక్షలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పారు. మరోవైపు థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దేశ పరువును తీసే విధంగా థరూర్ వ్యాఖ్యానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.