IPL 2020: కోల్‌కతాను గెలిపించిన బౌలర్లు.. రాజస్థాన్ చిత్తు

Kolkata Knight Riders won the match against RR

  • వరుస విజయాల రాజస్థాన్‌కు చెక్
  • రాజస్థాన్ ఆటగాళ్లలో 8 మంది సింగిల్ డిజిట్‌కే అవుట్
  • పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లిన కేకేఆర్

ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయం సాధించింది. ఇంతకుముందు కొండంత విజయాన్ని కూడా అలవోకగా ఛేదించిన రాజస్థాన్ ఈసారి కోల్‌కతా బౌలర్ల ముందు సాగిలపడింది. ఫలితంగా 175 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పరాజయం పాలైంది. వరుస విజయాల రాజస్థాన్‌కు బ్రేక్ పడింది.

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా పడుతూ లేస్తూ మొత్తానికి 174 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. కింగ్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 223 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదించిన రాజస్థాన్ ఈసారి పేలవంగా ఆడింది. కోల్‌కతా బౌలర్లకు తలొగ్గి వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది.

15 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయిన రాజస్థాన్ వికెట్ల పతనం ఓటమి వరకు కొనసాగుతూనే ఉంది. కెప్టెన్ స్మిత్ (3) సంజు శాంసన్ (8), రాబిన్ ఉతప్ప (2), రియాన్ పరాగ్ (1), రాహుల్ తెవాటియా (14) వంటి హిట్టర్లు ఏమాత్రం పోరాట పటిమ చూపకుండానే చేతులెత్తేశారు.

టామ్ కరన్ (54) అర్ధ సెంచరీతో కాసేపు జట్టును నిలబెట్టే ప్రయత్నం చేసినా సహచరుల నుంచి అతడికి సహకారం లభించలేదు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌లో 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారంటే వారి ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరన్ అర్ధ సెంచరీ తర్వాత బట్లర్ చేసిన 21 పరుగులు రాజస్థాన్ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. కోల్‌కతా బౌలర్లలో శివమ్ మావి, కమలేశ్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీసుకోగా, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.  36 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఉనద్కత్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి నుంచి పెద్ద భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో మ్యాచ్ చప్పగా సాగింది. క్రీజులో నిలదొక్కుకున్న గిల్ బ్యాట్ ఝళిపించే ప్రయత్నం చేసి జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 34 బంతులు ఆడిన గిల్ 5 ఫోర్లు, సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితిశ్ రాణా, రస్సెల్‌ల నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశించినా నిరాశే ఎదురైంది. మూడు సిక్సర్లు కొట్టి అలరించిన రస్సెల్ మరో భారీ షాట్‌కు యత్నించి రాజ్‌పూత్ బౌలింగ్‌లో ఉనద్కత్‌కు దొరికిపోయాడు. ఆ వెంటనే కెప్టెన్ కార్తీక్ (1) కూడా పెవిలియన్ చేరడంతో 150 పరుగులు చేయడమే గొప్ప అని భావించారు.

అయితే, మోర్గాన్ కొంత దూకుడుగా ఆడడంతో జట్టు స్కోరు కొంత పెరిగింది. 23 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో మోర్గాన్ 34 పరుగులు చేశాడు.  కమిన్స్ 12, నాగ్‌కోటి 8 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 170 పరుగులు దాటింది. రాజస్థాన్ బౌలర్లలో అర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, రాజ్‌పూత్, ఉనద్కత్, టామ్ కరన్, రాహుల్ తెవాటియాలు చెరో వికెట్ తీసుకున్నారు. జోస్ బట్లర్, సంజు శాంసన్ వికెట్లు తీసి రాజస్థాన్ పరాజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ మావికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తాజా విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

IPL 2020
Rajasthan
Kolkata
Dubai
Shivam Mavi
  • Loading...

More Telugu News