SP Charan: మా నాన్న వైద్య ఖర్చుల్లో కొంత మేం కట్టాం, మిగతాది బీమా సంస్థ చెల్లించింది: ఎస్పీ చరణ్

SP Charan clarifies over hospital bills

  • ఎంజీఎం వైద్యులతో కలిసి మీడియా ముందుకొచ్చిన చరణ్
  • ఆసుపత్రి వర్గాలు ఎంతో పారదర్శకంగా వ్యవహరించాయని వెల్లడి
  • బిల్లుల కోసం ఒత్తిడి చేశారనడం అవాస్తవమన్న బాలు తనయుడు

ఇటీవల కన్నుమూసిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 50 రోజుల పాటు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే, ఆసుపత్రి బిల్లులు చెల్లించలేక బాలు కుటుంబ సభ్యులు ఇతర మార్గాల్లో ప్రయత్నించారని, ఆసుపత్రి వర్గాలు ఇన్నిరోజుల పాటు ఏం చికిత్స చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో బాలు తనయుడు ఎంజీఎం ఆసుపత్రి వర్గాలకు మద్దతుగా నిలవడంతో పాటు తమపై వస్తున్న ఆరోపణలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు.

ఈ సాయంత్రం చెన్నైలో ఎంజీఎం ఆసుపత్రి వైద్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ, నాన్న లేని ఈ కష్టకాలంలో దుష్ప్రచారాలు వద్దని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి ప్రతి విషయంలో ఎంజీఎం వర్గాలు ఎంతో పారదర్శకంగా వ్యవహరించాయని, ఏ టెస్టుకు ఎంత ఖర్చు అయింది, ఏ మందులకు ఎంత ఖర్చయిందన్న విషయం తమకు స్పష్టంగా తెలియజేసినట్టు వివరించారు.

"నాన్న మరణించిన రోజున విధుల్లో ఉన్న డాక్టర్ నాకు మంచి స్నేహితుడు. బిల్లు ఎంతయింది? ఎప్పుడు చెల్లించాలి? అని అడిగాను. ఇప్పుడేమీ వద్దులే, బిల్లు విషయం తర్వాత చూద్దాం అన్నాడు. ఆసుపత్రి అకౌంటెంట్ ను అడిగితే... బిల్లుల గురించి చరణ్ ను ఇప్పుడేమీ అడగవద్దని, ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చకచకా చేయండి అని ఆయనతో ఎంజీఎం ఆసుపత్రి డైరెక్టర్ చెప్పారని తెలిసింది.  అంతే తప్ప, ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు మా నాన్న భౌతికకాయం ముందు బిల్లుల కోసం ఒత్తిడి చేసినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం" అని స్పష్టం చేశారు. బిల్లుల విషయానికొస్తే కొంత తాము కట్టామని, మిగతాది బీమా సంస్థ చెల్లించిందని చరణ్ వెల్లడించారు.

SP Charan
Hospital Bills
SP Balasubrahmanyam
MGM Hospital
Chennai
  • Loading...

More Telugu News