Uttar Pradesh: అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసి.. ఎవ్వరికీ చెప్పకుండా నాలుక కోసి చిత్రహింసలు

  • ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ ప్రాంతంలో ఘటన
  • ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స
  • ఆలస్యంగా పోలీసుల చర్యలు
gang rape in up

ఓ అమ్మాయి (20) పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమె నాలుక కోసేశారు. ఈ దారుణ ఘటన  ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆమె శరీరంపై ఎన్నో గాయాలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె ఓ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతోంది.

ఆమెను అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఆ యువతి షెడ్యూల్‌ కులానికి చెందిన అమ్మాయని, నిందితులు అగ్రవర్ణ కులానికి చెందిన వారని, దీంతో మొదట పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. చివరకు యువతి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఆ నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఆలస్యంగా చర్యలు తీసుకోవడం పట్ల బాధితురాలి సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తన తల్లితో పాటు సోదరి పొలం పనులు చేయడానికి వెళ్లగా అత్యాచార ఘటన చోటు చేసుకుందని చెప్పాడు. తన చెల్లి ఒక్కతే పొలం పనులు చేస్తోన్న సమయంలో లాక్కెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పాడు. అనంతరం ఆమెపై దాడి చేశారని, తమ పేర్లు చెప్పకుండా  నాలుకను కోసేశారని తెలిపాడు. తమ గ్రామానికి చెందిన యువకులే ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పాడు.

More Telugu News