WHO: ప్రపంచ దేశాలు స్పందించకుంటే 20 లక్షల మంది ప్రాణాలు పోతాయి: డబ్ల్యూహెచ్ఓ

  • ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా
  • అన్ని దేశాలూ యుద్ధంచేయాలి
  • ప్రజలు కూడా సహకరించాల్సిందే
  • డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైకేల్ ర్యాన్

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19 కట్టడికి తక్షణం ప్రపంచ దేశాలన్నీ చర్యలు చేపట్టకుంటే, దాదాపు 20 లక్షల మంది వరకూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. వెంటనే కరోనాపై అన్ని దేశాలూ యుద్ధం ప్రకటించాలని సూచించింది. ఈ వ్యాధి తొలిసారిగా చైనాలోని వూహాన్ లో వెలుగు చూడగా, ఆపై 9 నెలల వ్యవధిలోనే 10 లక్షల మంది వరకూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఈ పరిస్థితి చాలా ఆందోళనకరమని, కేవలం ప్రభుత్వాలు మాత్రమే చర్యలు చేపడితే సరిపోదని, ప్రజలు సైతం తమతమ స్థాయిలో వైరస్ ను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ అన్నారు. ఈ వైరస్ తగ్గుముఖం పడుతుందన్న సూచనలు ఇంతవరకూ కనిపించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలావుండగా, కరోనా వ్యాక్సిన్ ను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అందుబాటులోకి తెచ్చామని వెల్లడిస్తూ, సైనికులకు, వైరస్ పై యుద్ధం చేస్తున్న ఫ్రంట్ లైన్ కార్యకర్తలు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న చైనా, ప్రపంచ శాస్త్రవేత్తల నుంచి వస్తున్న విమర్శలను సైతం పక్కనబెట్టి, వారికి రెండో డోస్ ను ఇస్తోంది. చైనాకు చెందిన సినోఫార్మ్ ఇప్పటికే 3.50 లక్షల మందికి పైగా పౌరులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్టు సమాచారం.

మరోవైపు తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతం మందికి బలవంతంగా సినోవాక్ ఈ వ్యాక్సిన్ ను ఇచ్చినట్టు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇదిలావుండగా, యూఎస్ కు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ, తమ వ్యాక్సిన్ ఒక్క డోసుతోనే కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో తయారవుతున్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ను 60 వేల మందిపై పరీక్షిస్తున్నారు.

More Telugu News