Sharad Pawar: ఈ రోజంతా నేను ఏమీ తినను: శరద్ పవార్

They love some people says Sharad Pawar

  • విపక్షాలకు చెందిన 8మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్
  • వారికి సంఘీభావం ప్రకటిస్తూ పవార్ ఒకరోజు నిరశనదీక్ష
  • ఇంత దారుణంగా బిల్లులను పాస్ చేయడాన్ని ఎప్పుడూ చూడలేదని మండిపాటు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు లోక్ సభ, రాజ్యసభల ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బిల్లులు రైతుల జీవితాలను నాశనం చేస్తాయంటూ విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో విపక్షాలకు చెందిన 8 మంది రాజ్యసభ సభ్యులను ఈ సమావేశాల మొత్తానికి సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, వారిపై సస్పెన్షన్ ఎత్తేసేంత వరకు సభలో అడుగుపెట్టబోమని విపక్షాలు ప్రకటించాయి. మరోవైపు సస్పెన్షన్ కు గురైన వారు పార్లమెంటు ప్రాంగణంలో ఉంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కూడా వారు అక్కడే పడుకున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులకు సంఘీభావంగా తాను కూడా నిరాహారదీక్షను పాటిస్తున్నానని... ఈ రోజంతా ఏమీ తిననని ప్రకటించారు. పార్లమెంటులో బిల్లులను ఇంత దారుణంగా పాస్ చేయడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఆయన మండిపడ్డారు. వీలైనంత త్వరగా బిల్లులను పాస్ చేయాలనేదే కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని అన్నారు.

బిల్లులపై సభ్యులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని... అయినప్పటికీ బిల్లులపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని తనకు అనిపించిందని చెప్పారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేనప్పుడు... సభ్యులు వెల్ లోకి పోవడం సహజమేనని అన్నారు. తమ అభిప్రాయాలను వెల్లడించిన సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు.

సభ నుంచి సస్పెన్షన్ కు గురై, పార్లమెంటు ప్రాంగణలో నిరసన చేపట్టిన సభ్యులకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ టీ ఆఫర్ చేశారనే విషయాన్ని తాను టీవీలో చూశానని... అయితే, ఆయన ఇచ్చిన టీని సభ్యులు తిరస్కరించారనే వార్త తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవార్ చెప్పారు. వారంతా వారి నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారని... ఇది కూడా ఒక రకమైన గాంధీగిరి అని తెలిపారు. అయితే గాంధీ సిద్ధాంతాలకు ఇంత అవమానం మునుపెన్నడూ జరగలేదని అన్నారు.

రాజకీయ ప్రత్యర్థులకు ఐటీ నోటీసులు పంపడాన్ని బీజేపీ ఒక అజెండాగా పెట్టుకుందని పవార్ దుయ్యబట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరే, సుప్రియా సూలే (పవార్ కూతురు, ఎంపీ)ల తర్వాత తనకు కూడా నోటీసులు వచ్చాయని చెప్పారు. 2009-10, 2014, 2020లలో తాను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి తనకు నోటీసులు ఇచ్చారని... కొంచెం క్లారిఫికేషన్ కావాలని అడుగుతున్నారని తెలిపారు. సుప్రియను కూడా గత మూడు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని అడుగుతున్నారని చెప్పారు. వారికి కొందరంటే చాలా ఇష్టమని... అలాంటివారికి నోటీసులు పంపుతుంటారని దుయ్యబట్టారు.

Sharad Pawar
NCP
Fasting
  • Loading...

More Telugu News